స్వలింగ సంపర్కం : ప్రియురాలిపై యాసిడ్ దాడి
లక్నో : స్వలింగ సంపర్కం ఓ బాలిక ప్రాణాల మీదకి తెచ్చింది. తనతో సంబంధం కొనసాగించడానికి నిరాకరించిన బాలికపై ఆగ్రహానికి గురైన ఓ యువతి హత్యాయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ దారుణం జరిగింది. వివరాలు.. దక్షిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపర్ణ (పేర్లు మార్చాం) తన తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. భానుమతి, అపర్ణ ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా లైంగిక సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని భానుమతి ఒత్తిడి తేవడంతో వారిమధ్య గొడవ మొదలైంది. తమ మధ్య గల సంబంధానికి అపర్ణ అడ్డు చెప్పడంతో భానుమతి కోపం పెంచుకుంది. ప్రియురాలిని అంతమొందించాలని రెండు నెలలుగా ప్లాన్ చేసింది.
గతవారం అపర్ణ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా భానుమతి ఆమెపై యాసిడ్తో దాడి చేసి పరారైంది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారని పోలీసులు వెల్లడించారు. కాగా, అపర్ణ మిత్రుడు విమల్పై నేరం మోపేందుకు భానుమతి యత్నించింది. చేతులపై యాసిడ్ పోసుకుని తాను కూడా విమల్ దాడిలో గాయపడినట్లు అందర్నీ నమ్మించింది. అపర్ణ తల్లిదండ్రులు కూడా విమల్పైనే అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తమ కూతురుతో విమల్ గొడవ పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, దర్యాప్తు అనంతరం పోలీసులకు అసలు నిజం తెలిసింది. భానుమతి, అపర్ణల మధ్య లైంగిక సంబంధం ఉందని వెల్లడైంది. నిందితురాలు భానుమతిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ ఆర్.కే.సింగ్ తెలిపారు. విచారణలో భానుమతి నేరం అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. ముఖం, ఛాతిపై తీవ్ర గాయాలు కావడంతో అపర్ణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.