హత్య కేసు దర్యాప్తు వేగవంతం

Investigation Speed Up On murder Case - Sakshi

హంతకుల కోసం ముమ్మరంగా గాలింపు

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణం?

మదనపల్లె క్రైం : మదనపల్లె సుభాష్‌రోడ్డుకు చెందిన ఆకుల రామాంజులు బాబు హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. హంతకులకు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి మదనపల్లె పట్టణం మోతీనగర్‌ సమీపంలోని గొట్టిగానిచెరువు మసీదు వద్ద రామాంజులు బాబును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. మృతుని కుమార్తె శ్రీప్రియ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యకు  రామాంజులు బాబు మొదటి భార్య, మృతుడి అన్న హస్తం ఉందని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును చేస్తున్నారు.

చనిపోయిన వ్యక్తికి మనదపల్లెలోని పుంగనూరు రోడ్డు, చంద్రాకాలనీ జాతీయ రహదారుల సమీపంలో రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఆస్తులను మృతుడి తండ్రి సిద్ధప్ప మాజీ సైనికుడిగా ఉన్నప్పుడు కుమారుడు రామాంజులబాబు పేరుతో ఆస్తిని బదలాయింపు చేశారు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు, పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు సమాచారం. ఇదివరకే పుంగనూరు రోడ్డులో రామాంజులు బాబుపై దాడి జరగడంతో తనకు ప్రాణహాని ఉందని పుంగనూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రాణహాని భయంతో మృతుడు సుభాష్‌రోడ్డు నుంచి పుంగనూరు రోడ్డుకు మకాం మార్చాడు. అయినా అతనికి ప్రాణగండం తప్పలేదు. ఆస్తికోసం చివరకు కిరాయి హంతకుల చేత హతమార్చారనే చర్చ సాగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top