అమెరికాలో భారతీయ వ్యక్తి ఆత్మాహుతి
వాషింగ్టన్ : అమెరికాలో ఆర్ణవ్ గుప్తా (33) అనే ఓ భారతీయుడు తనకుతాను నిప్పంటించుకుని చనిపోయాడని పోలీసులు గురువారం చెప్పారు. మేరీలాండ్ రాష్ట్రంలోని బెథెస్దలో ఉంటున్న ఆర్ణవ్ బుధవారం మధ్యాహ్నం శ్వేతసౌధం సమీపంలోని ఎల్లిప్స్ అనే పార్క్లో నిప్పంటించుకున్నాడు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణిం చాడు. అంతకుముందు బుధవారం ఉదయమే ఆర్ణవ్ కనిపించడంలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆర్ణవ్ కనిపిస్తే చెప్పాల్సిందిగా ప్రజలను కోరుతూ పోలీసులు నోటీసులు కూడా అంటించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఆర్ణవ్ తనకుతాను నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడం కోసం ఆయన వాడిన రసాయనం ఏంటో నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎల్లిప్స్ పార్క్కు దగ్గర్లో ఆర్ణవ్ తన కారును ఎక్కడైనా నిలిపాడేమోనని పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై విచారణ జరుగుతోంది. కాగా, ఆర్ణవ్ నిప్పంటించుకున్నాక ఆ ఘటనను అలెగ్జాండ్రియాకు చెందిన ఓ బాలిక వీడియో తీయగా, ఆమె తండ్రి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.