భార్యను వదిలేస్తానన్న భర్తకు దేహశుద్ధి
పశ్చిమగోదావరి, పెదపాడు : ఆడపిల్ల పుట్టిందనే కారణంగా భార్యను వదిలేసేందుకు ప్రయత్నించిన భర్తకు బంధువులు దేహశుద్ధి చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. దెందులూరు మండలం సానిగూడెం గ్రామానికి చెందిన కె.శ్రీకాంత్కు వట్లూరులోని దళితవాడకు చెందిన ఎబీషాతో ఏడాది క్రితం వివాహమైంది. ఆ సమయంలో రూ.4 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్న కానుకలుగా శ్రీకాంత్కు అత్తవారు ఇచ్చారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం ఎబిషాను శ్రీకాంత్ వేధిస్తున్నాడు.
ఇటీవల ఎబిషాకు ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం వట్లూరులోని ఎబిషాను తన మేనమామ ఇంట్లో వదిలేసి వెళ్లిపోవాలని ప్రయత్నించిన శ్రీకాంత్ను బంధువులు నిలదీయగా ఆమెను వదిలేస్తానని సమాధానమిచ్చాడు. దీంతో శ్రీకాంత్కు వారు దేహశుద్ధి చేసి ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే ఇరువర్గాల వారు మాట్లాడుకుని సరిచేసుకుంటామని చెప్పడంతో ట్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు.