ప్రేమించాడు..పెళ్లాడాడు.. రాక్షసుడయ్యాడు!
భార్య తల పగులగొట్టి.. బంధువులతో కలిసి హత్యాయత్నం చేసిన భర్త
కేకలు వేయడంతో రక్షించిన ప్రజలు
కనిగిరి: ప్రేమించి పెళ్లిన చేసుకున్న భర్తకు అనుమానమే దయ్యం పట్టుకుంది. దీంతో కర్రతో భార్య తల పగులగొట్టడమే కాకుండా.. బంధువులతో కలిసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన బుధవారం కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. ఇండ్లా రామయ్య కుమార్తె ప్రియాంక, దగ్గరి బంధువైన గిద్దలూరు మండలం బయ్యన్న పల్లికి చెందిన రమణ కుమారుడు పులిచెర్ల మురళీ కృష్ణ ప్రేమించుకున్నారు. పెద్దలతో సంబంధం లేకుండా 2017 జూన్లో పెళ్లి చేసుకున్నారు. మురళీకృష్ణ యానిమల్ మెడికల్ రిప్రజెంటివ్గా పనిచేస్తున్నాడు. ప్రియాంక గుంటూరులో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ ఒంగోలులో కాపురం పెట్టారు.
ఈక్రమంలో భార్య ప్రియాంకపై భర్త మురళి అనుమానం పెంచుకుని.. ప్రియాంక చదువు మాన్పించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కసి పెంచుకున్న మురళి మంగళవారం ఒంగోలులో ఉన్న ప్రియాంక తలపై కర్రతో కొట్టాడు. తల పగిలి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను అత్తగారిల్లు అయిన తుమ్మగుంటలో వదిలి పెట్టేందుకు మోటార్ బైక్పై బయలు దేరాడు. ఘటనా విషయాన్ని మురళి ముందుగానే తన బంధువులకు తెలిపాడు. ఈ క్రమంలో పొదిలి రోడ్డులో నుంచి తుమ్మగుంటకు తీసుకెళ్లకుండా.. కంభం రూట్లో నుంచి శ్రీరంగపురం మీదుగా తుమ్మగుంట తీసుకెళ్తానని ప్రియాంకకు నమ్మబలికాడు. దీంతో గిద్దలూరు నుంచి సుమారు 8 మంది కారులో శ్రీరంగాపురం వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో శ్రీరంగపురం వద్ద తనను భర్త, అతని బంధువులు కొట్టి చంపేందుకు ప్రయత్నించారని..తాను కేకలు పెట్టడంతో స్థానికులు రక్షించి.. తుమ్మగుంటకు చేర్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త మురళీ కృష్ణ, మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై మా బాష తెలిపారు. క్షతగాత్రురాలు కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మరిన్ని వార్తలు