భార్య చెప్పుతో కొట్టినందుకు భర్త ఆత్మహత్య
ఏడాది క్రితం వివాహం ..పెళ్లైన వారానికే విడాకులు
పోలీసులకు యువతి ఫిర్యాదు
కృష్ణా, చాట్రాయి (నూజివీడు) : భార్య చెప్పుతో కొట్టినందుకు మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన. మండల కేంద్రమైన చాట్రాయి గ్రామానికి చెందిన చుండూరు కిషోర్ (22) మండలంలోని సి గుడిపాడు గ్రామానికి చెందిన బిలుగుది శ్యామలతో ఏడాది క్రితం వివాహమైంది. పెళ్లయిన 7 రోజులకు ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. కిషోర్ నన్ను వేధిస్తున్నాడంటూ ఈ నెల 19న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు కిషోర్కి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె జోలికి వెళ్లనని హామీపత్రం రాశాడు. మరుసటి రోజు ఇద్దరిని పోలీసులు స్టేషన్కి పిలిపించారు. పోలీసులు కిషోర్తో మాట్లాడుతుండగా శ్యామల చెప్పుతో కిషోర్ని పోలీసుల ఎదుట కొట్టింది. దీనికి మనస్తాపం చెంది తన ఇంట్లో గురువారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ముందు శ్యామల చెప్పుతో కొట్టడం వలన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసుకున్నాడు.
స్టేషన్ ముందు ధర్నా..
కిషోర్ చావుకు బాధ్యులను శిక్షించాలంటూ మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న నూజివీడు డీఎస్పీ సీహెచ్జీ ప్రసాద్, తిరువూరు సీఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులతో సంప్రదింపులు జరిపారు. కాగా, తన కొడుకు చావుకి కారకులైన బిలుగుది శ్యామల, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ మృతుడి తండ్రి చుండూరు ఆదియ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.