ముసునూరులో ఉద్రిక్తత.. పోలీసు వాహనాలు ధ్వంసం

High Tension At Musunuru In Krishna District - Sakshi

కృష్ణా జిల్లా : ముసునూరు మండలం గుళ్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణి అనే బాలిక అంత్యక్రియల్లో బంధువులు ఆందోళనకు దిగారు. శ్రావణి ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శ్రావణి మృతదేహాన్ని ఖననానికి తరలించే ప్రయత్నం చేసిన పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులకు, బాధితులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఘర్షణలో రెండు పోలీసు వాహనాలు ధ్వంసం కాగా, పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. స్మశాన వాటిక దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న నూజివీడు సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐలు రంజిత్ కుమార్, శ్రీనివాస్‌లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, శ్రావణిని ఆమె ప్రేమికుడు శివాజీనే హత్య చేశాడంటూ రెండు రోజులుగా బాధితులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top