టీచర్పై విద్యార్థి దారుణం
చండీగడ్ : హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. హోంవర్క్ చూపించమన్నందుకు టీచర్పై పదకొండో తరగతి విద్యార్థి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన టీచర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... హర్యానాలోని సోనాపేట్ గ్రామంలో శ్రీరామ్ కృష్ణ అనే స్కూల్లో ముఖేష్ కుమారి ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హలీడే హోంవర్క్ చూపించమని విద్యార్థులను అడిగారు. ఒక్కో విద్యార్థి దగ్గరికి వెళ్లి చెక్చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో టీచర్ తన వద్దకు రాగానే ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. నాలుగుసార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే కుమారి అరుపులు విన్న మరో టీచర్ సదరు విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారి మాట్లాడుతూ..‘ హోం వర్క్ చూపించమన్నాను అంతే. తన బ్యాగులో ఉన్న కత్తి తీసి నన్ను పొడిచేశాడు. తను ఎప్పుడూ హోంవర్క్ చేసేవాడు కాదు. కానీ ఇంత పనిచేస్తాడనుకోలేదు’ అని భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.