మాకేదీ న్యాయం? :హాజీపూర్‌ వాసులు

Hajipur Victim Familes Waiting For Justice In Yadadri District - Sakshi

హాజీపూర్‌ కేసులో జాప్యం

కోర్టు తీర్పు కోసం బాధితుల నిరీక్షణ

రెండు నెలల్లో శిక్ష ఖాయమంటున్న పోలీసులు

వరంగల్‌ కోర్టు తీర్పుపై బాధితుల హర్షం

సాక్షి, యాదాద్రి: పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల కేసులో నిందితుడు సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఇచ్చే తీర్పు కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. వరంగల్‌లో 9నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి హత్య చేసిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడంతో మరోసారి హజీపూర్‌ ఘటన తెరపైకి వచ్చింది. తమ పిల్ల ఉసురు తీసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. సమాజంలో మరెవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదని కోర్టు ఇచ్చే తీర్పు కఠినంగా ఉండాలని వారు కోరుతున్నా రు.

హన్మకొండ కోర్టులో తీర్పు వచ్చినంత తొం దరంగా హజీపూర్‌ కేసులో ఎందుకు రావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణలో భువనగిరిజోన్‌ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. ఏప్రిల్‌ 26న బొమ్మలరామారం మండలం హజీపూర్‌కు చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30వ తేదీన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్‌ సెంట్రల్‌ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్‌ కోర్టులో కేసు విచారణకు రానుంది. 

చార్జి్జషీట్‌ దాఖలుతో..
మండలంలోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి  అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన  విషయం విధితమే. ఏప్రిల్‌ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్‌ కçస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్‌ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్‌ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాం గం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

రెండుసార్లు పోలీస్‌ కస్టడీకి 
హజీపూర్‌ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని మూడు హత్య కేసులపై పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొదటిసారి మే 8నుంచి 13వరకు, రెండోసారి జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. 

సత్వరమే తీర్పు ఇవ్వాలి 
అపహరణ, లైంగికదాడి, హత్యలు లాంటి కేసుల్లో సత్వరమే తీర్పు ఇవ్వాలి.  నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలి. వరంగల్‌ నిం దితుడు ప్రవీణ్‌ కేసులో న్యాయం జరిగిందని, అలాగే శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేస్తే ప్రజలకు మనోధైర్యం కలుగుతుంది. ప్రజ లకు కోర్టుల మీద విశ్వాసం పెరుగుతుంది. ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించే వారికి కోర్టు తీర్పులు చెంపపెట్టుకావాలి. హజీపూర్‌ బాధితులకు న్యా యం జరగాలి. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలి. 
– కొడారి వెంకటేశ్, సామాజిక ఉద్యమకారుడు

ఉరిశిక్ష విధించాలి 
9నెలల చిన్నారి శ్రీహిత కేసులో వరంగల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడం సరైందే. ముగ్గురు ఆడపిల్లలపై కిరాతకంగా వ్యవహరించిన మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉరిశిక్షే విధించాలి. కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిందితుడి తరఫున అడ్వకేట్‌ను నియమించడం సరికాదు. 
–పాముల నర్సింహ, శ్రావణి తండ్రి

శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు 
ఆడ పిల్లలపై మృగంలా ప్రవర్తించిన సైకో శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు. ఇలాంటి మనుషులు బతికుంటే భూమిపైన ఆడోళ్లకు భద్రత లేదు. సర్కారోళ్లు ఇంకా శ్రీనివాస్‌రెడ్డిని చంపకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుస్తలేదు. శ్రీనివాస్‌రెడ్డి చస్తనే మా పిల్లల ఆత్మలు శాంతిస్తాయి.
– తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి

బహిరంగంగా ఉరి తీయాలి
మా బిడ్డలపై దారుణాలకు ఒడగట్టిన శ్రీనివాస్‌రెడ్డి బ హిరంగంగా అందురు చూస్తుండగానే ఉరి తీయాలి. శ్రీనివాస్‌రెడ్డి చావును చూసి పాపం చేయాలనుకునే వాళ్లకు భయం పుట్టాలి. ఆడపిల్లలను కనడమే పాపమైంది. ప్రభుత్వం  శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష అమలు చేసి నేరస్తులకు భయం పెట్టాలి. లేకుండా సర్కారుపై నమ్మకం లేకుంటాపొతది.
 – తిప్రబోయిన మల్లేష్, మనీషాతండ్రి

అక్టోబర్‌లో తుది తీర్పు 
హజీపూర్‌ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో అక్టోబర్‌లో తుది తీర్పు వస్తుంది. సెషన్స్‌ కోర్టు నల్లగొండలో వచ్చే నెల మొదటి వారంలో విచారణ ప్రారంభంకానుంది. నిందితుడిపై మూడు కేసులు ఒకేసారి నమోదు చేయడం, డీఎన్‌ఏ నివేదిక, విచారణలో భాగంగా పలు ఆధారాల సేకరించి చార్జిషీట్‌ దాఖలు చేశాం.
  – నారాయణరెడ్డి, భువనగిరిజోన్‌ డీసీపీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top