ఆటోడ్రైవర్పై మహిళ కాల్పులు
సాక్షి, గుర్గావ్ : రోడ్డుపై వాహన పార్కింగ్ విషయంలో 34 ఏళ్ల మహిళ ఆటో డ్రైవర్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహిళతో పాటు ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదచేశారు. గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో నగరంలోని భవాని ఎన్క్లేవ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన అంతటినీ స్ధానికులు కొందరు వీడియో తీసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆటోడ్రైవర్ సునీల్ రోడ్డు పక్కన తన వాహనాన్ని పార్క్ చేయగా సప్న అనే మహిళ వాహనాన్ని అక్కడినుంచి తీసుకెళ్లాలని కోరింది. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఆగ్రహంతో ఊగిపోయిన సప్న తుపాకీని తీసి సునీల్ నుదుటికి గురిపెట్టి కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ తన చెవి పక్కగా దూసుకెళ్లిందని, సప్న భర్త భురే కూడా తనను చెంపపై కొట్టాడని సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా నిందితులైన భార్యాభర్తలు ఇరువురినీ అరెస్ట్ చేశామని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఏసీపీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.