దొరికినోడు జారుకున్నాడు!

Fraud Jobs Accused Escape From CCS Police - Sakshi

సీసీఎస్‌ పోలీసుల కస్టడీ నుంచి మోసగాడు ఎస్కేప్‌

జాబ్‌ ప్రాడ్‌ కేసులో కోల్‌కతాలో పట్టుకున్న వైనం

రైలులో తీసుకువస్తుంటే   విశాఖపట్నంలో పరారీ

జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసిన పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల పేరుతో భారీ స్కామ్‌కు పాల్పడిన నిందితుడిని సిటీ సీసీఎస్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కోల్‌కతాలో చిక్కిన ఇతగాడిని రైలులో తీసుకువస్తుండగా విశాఖపట్నంలో తప్పించుకున్నాడు. పట్టుకోవడానికి సిటీ అధికారులు అక్కడ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వైజాగ్‌ రైల్వే స్టేషన్‌లోని గవర్నమెంట్‌ రైల్వే పోలీసు (జీఆర్పీ) ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ దాసరథి శుక్రవారం తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన గులాం మహ్మద్‌ ఇల్లాహి అలియాస్‌ గుల్జార్‌ (55) నగరానికి చెందిన ఆలియా భానును వివాహం చేసుకున్నాడు. దీంతో అతగాడు కొన్నాళ్ల పాటు సిటీలోనే నివసించాడు. ఈ నేపథ్యంలోనే తరచు దారుల్‌షిఫాలోని ఓ ప్రార్థనా స్థలానికి వెళ్తుండేవాడు. అక్కడే ఇతడికి గతేడాది జనవరిలో యాకత్‌పురకు చెందిన ఉపాధ్యాయుడు ముదస్సిర్‌ అలీ తదితరులతో పరిచయమైంది. వీరికి మతపరమైన అంశాలను బోధించిన గుల్జార్‌ అందరినీ ఆకర్షించాడు. తనకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి వినియోగించి రైల్వే, ఎస్బీఐ, ఎఫ్‌సీఐ వంటి కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు.

ఒక్కొక్కరి నుంచి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షల వరకు వసూలు చేశాడు. ఆపై రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి అందులో వీరందరి పేర్లు పొందుపరుస్తూ ఉద్యోగాలకు ఎంపికైనట్లు చూపించాడు. కొన్ని రోజుల తర్వాత అందరికీ కోల్‌కతాకు రప్పించి అక్కడి హౌరాలో ఉన్న రైల్వే ఆర్థోపెడిక్‌ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించి అందులోనూ ఉత్తీర్ణులయ్యారని చెప్పాడు. మరోసారి గతేడాది ఏప్రిల్‌ బాధితుల్ని కోల్‌కతాకు తీసుకువెళ్లి అక్కడి వర్థమాన్‌ ప్రాంతంలోని ఓ చోట ఉంచి కొన్నాళ్ల పాటు శిక్ష కూడా ఇచ్చాడు. దీనికోసం రైల్వేకు సంబంధించిన ఓ సెట్‌ను గుల్జార్‌ సిద్ధం చేశాడు. త్వరలోనే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ వస్తాయని వాటిలో పేర్కొన్న ప్రాంతాలకు వెళ్లి రైల్వే ఉద్యోగాల్లో చేరాలని సూచించాడు. ఈ వ్యవహారాల్లో ఆలియా భాను ప్రమేయం సైతం ఉన్నట్లు బాధితులు గుర్తించారు. జూలై 10 నుంచి గుల్జార్‌ స్పందించడం మానేయడంతో ముదస్సిర్‌ అలీ సెప్టెంబర్‌ వరకు వేచి చూశాడు. అతగాడి ఆచూకీ లేకపోవడంతో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది సెప్టెంబర్‌ 12న భార్యాభర్తలపై కేసు నమోదైంది. దీని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు కోల్‌కతాలో ఉన్నట్లు గుర్తించారు.

వారి కోసం ఇటీవల ఓ ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లింది. దాదాపు వారం రోజుల పాటు ముమ్మరంగా గాలించిన నేపథ్యంలో ఇద్దరినీ గుర్తించి పట్టుకున్నారు. గుల్జార్‌ను అక్కడే అరెస్టు చేసిన పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్‌ తరలించడానికి ట్రాన్సిట్‌ వారెంట్‌ (టీఆర్‌ నెం.12863) తీసుకున్నారు. మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో ఆలియా భానును అరెస్టు చేయకుండానే ఆమెను ఒప్పించి తమ వెంట తీసుకురావడానికి సంసిద్ధులయ్యారు. బుధవారం రాత్రి వీరిద్దరితో ప్రత్యేక బృందం హౌరా–యశ్వత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరింది. అక్కడ నుంచి హైదరాబాద్‌ తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం ఉదయం 11.15 గంటల సమయంలో ఈ రైలు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ సీసీఎస్‌ పోలీసుల కళ్లుగప్పిన గుల్జార్‌ తప్పించుకున్నాడు. అతడి కోసం స్టేషన్‌తో పాటు చుట్టు పక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో ఎస్సై ఎస్‌.రంజిత్‌కుమార్‌ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై జి.బాలకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. ఆలియా భానును సిటీకి తీసుకువచ్చిన పోలీసులు శుక్రవారం సీఆర్సీసీ 41 (ఏ) నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారని తెలిసింది. గుల్జార్‌ కోసం సీసీఎస్‌తో పాటు వైజాగ్‌ జీఆర్పీ పోలీసులూ ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top