అయ్యో మంజుల.. 

Four Members Died..Women In Sad - Sakshi

ఇటీవల కూతురు, కొడుకు, నిన్న భర్త 

ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యుల ఆత్మహత్య 

మంజులను ఒంటరి చేసిన విధి 

బాధ దిగమింగుకుని భర్తకు అంత్యక్రియలు

వర్గల్‌(గజ్వేల్‌): వరుస విషాదాలతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తనను ఒంటరి చేసి ఒక్కొక్కరుగా ఈ లోకం విడిచిన కుటుంబ సభ్యులను తలచుకుంటూ కుమిలిపోతోంది. ఆఖరుకు భర్తకు తలకొరివి పెట్టేవారు లేక తానే తల కొరివిపెట్టి భర్త రుణం తీర్చుకుంది. దేవుడా..నాకెందుకింత అన్యాయం చేశావంటూ బోరుమంది. ఈ విషాదకర ఘటన ఆదివారం వర్గల్‌ మండలం గౌరారంలో చోటుచేసుకుంది.

గౌరారంకు చెందిన పల్లె యాదగిరి–మంజుల దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి, సొంతిల్లు ఉంది. వీరికి ముగ్గురు పిల్లలు కాగా చిన్న కూతురు చాలా కాలం క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. పదో తరగతి చదివి మానేసిన పెద్ద కూతురు మనీష సుమారు ఏడాది క్రితం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం నుంచి కోలుకోకముందే నాలుగు నెలల క్రితం ఇంటర్మీడియట్‌ చదివిన కొడుకు మహేష్‌ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

ముగ్గురు పిల్లల అకాల మరణంతో యాదగిరి–మంజుల దంపతులు పెనువిషాదంలో కూరుకుపోయారు. ఈ ఘటనలు మరచిపోకముందే తాజాగా పది రోజుల క్రితం భర్త యాదగిరి తన వ్యవసాయ భూమి వద్ద క్రిమిసంహారక మందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. భర్త సహ పిల్లల వరుస మరణాలు మంజులను ఒంటరి చేశాయి. అంతులేని శోకాన్ని, పెను విషాదాన్ని మిగిల్చాయి.    
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top