కార్వాన్లో అగ్ని ప్రమాదం
ఫర్నిచర్ వర్క్షాపులు, గోదాంలు దగ్ధం
దాదాపు రూ.50 కోట్ల ఆస్తి నష్టం
గోల్కొండ: కార్వాన్ మొగల్ కా నాలా వద్ద సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ కార్ఖానాలో నిప్పంటుకోవడంతో మంటలు ఫర్నిచర్ గోదాంలకు వ్యాపించాయి. టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో గోదాంలు, వర్క్షాపులలో నిల్వ ఉంచిన ఫర్నిచర్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఐదు ఫైరింజన్ల సహాయంతో ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రూ. 50 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.