భార్యపై అనుమానం.. కుమారుడి గొంతుకోసి..
పూనే : భార్య మీద ఉన్న అనుమానంతో కుమారుడి గొంతుకోసి దారుణంగా హత్య చేసాడో తండ్రి. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూనేలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూనేకు సమీపంలోని పథారే వస్తీకి చెందిన యోగేశ్ పరాశ్రమ్, గౌరీ భార్యభర్తలు. వీరికి ఆయుష్ యోగేశ్ బాసరే అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత కొద్ది నెలలుగా గౌరీ అక్రమసంబంధం కొనసాగిస్తోందనే అనుమానం యోగేశ్ను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ తరుచూ గొడవలు పడేవారు. గురువారం కూడా గొడవ జరగటంతో గౌరీ అక్కడికి దగ్గరలో ఉన్న సోదరుడి ఇంటికి వచ్చేసింది. కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న యోగేశ్.. భార్యతో మాట్లాడాలని తన బావమరిదితో చెప్పాడు.
భార్యాభర్తలిద్దరూ ఓ 20 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడు ఆమెపై దాడికి దిగాడు. అంతేకాకుండా అడ్డువచ్చిన బావమరిది, కొడుకుపై సైతం దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. గొంతుపై తీవ్రగాయమైన ఆయుష్ మార్గం మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మోగేశ్ను అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల క్రింద అతడిపై కేసులు నమోదు చేశారు. దాడి అనంతరం యోగేశ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, మణికట్టు కోసుకున్నాడని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు