కసాయి తండ్రి
నెలరోజుల ఆడబిడ్డను గొంతుపిసికి హత్య
బనశంకరి: అల్లారుముద్దుగా ఆడించాల్సిన తండ్రి హంతకుడయ్యాడు. ఆడపిల్ల పుట్టిందని కారణంతో ఒకనెల పసికందును ఓ కిరాతక తండ్రి గొంతునులిమి చంపాడు. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లా సిందిగెరె పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లాలోని చోచనహళ్లి లో సుచిత్రా, మంజు బోవి దంపతులు నివాసముంటున్నారు. పెళ్లైన కొత్తలో దంపతులు ఇద్దరూ అనోన్యంగా ఉండేవారు, కొద్దిరోజుల్లో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమైయ్యాయి.
సుచిత్ర నెలక్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మొదటి సంతానంలో మగబిడ్డ పుట్టలేదని మంజు సూటిపోటి మాటలతో భార్యను వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన మంజు ఆ మత్తులో పసికందు గొంతుపిసికి చంపాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు చేరుకుని కసాయి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతితో తల్లి సుచిత్రా కన్నీరుమున్నీరైంది.