బిడ్డను కడతేర్చిన తండ్రి
చెన్నై ,వేలూరు: తండ్రాంబట్టు సమీపంలో అన్యం పుణ్యం ఎరుగని మూడు నెలల కుమారుడిని కత్తితో నరికి చంపిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తండ్రాంబట్టు సమీపం కాంపేట గ్రామానికి చెందిన కార్తికేయన్ (30) గ్రామంలోనే చిన్న దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి రాజేశ్వరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు మూడు నెలల కుమారుడున్నాడు. శనివారం రాత్రి యథావిధిగా ఇంట్లో కార్తికేయన్, భార్య రాజేశ్వరి, తండ్రి ధనపాల్, చిన్నారి నిద్రించారు.
అర్ధరాత్రి సమయంలో శబ్దం రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన రాజేశ్వరి, భర్త చిన్నారిని కత్తితో నరకడం గమనించి బిగ్గరగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారందరూ వచ్చి చూడగా అప్పటికే కార్తికేయన్ మూడు నెలల చిన్నారిని హత్యచేశాడు. దీనిపై గ్రామస్తులు వానాపురం పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ హైమసుందర్, తండ్రాంబట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కార్తికేయన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో.. కార్తికేయన్ మతిíస్థిమితం సరిగాలేదని తెలిసింది. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.