జంగపల్లిలో రైతు దారుణహత్య

Farmer Murdered Crually In Karimnagar - Sakshi

గన్నేరువరం(మానకొండూర్‌): మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన రైతు అనుమండ్ల మల్లయ్య(65) గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. తలపై కర్రలతో విచక్షణారహితంగా బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..అనుమండ్ల మల్లయ్య ఆదివారం సాయంత్రం యథావిధిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని దారిన వెళ్లేవారు గమనించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవాన్ని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. సర్పంచ్‌ అటికం శారదశ్రీనివాస్, ఎంపీటీసీ అనుమండ్ల మల్లేశం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిమ్మాపూర్‌ సర్కిల్‌ సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై వంశీకృష్ణ, తిమ్మాపూర్‌ ఎస్సై నరేశ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

నిందితులను గుర్తించేందుకు క్లూస్‌ టీం, జాగీలాలను రప్పించి హత్య జరిగిన తీరును పరిశీలన చేశారు. జాగిలాలు తిమ్మాపూర్‌ మండలం జూగుండ్ల గ్రామం దారివైపు వెళ్లి నిలిచిపోయాయి. హత్యకు భూ కక్షలు కారణమని తెలుస్తోందని, విచారణ చేపట్టి నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. మృతుడికి కుమారుడు అంజయ్య ఉన్నాడు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top