తాగుడు.. దూకుడు!

Drunk ANd Drive Cases Filed in Hyderabad - Sakshi

సైబరాబాద్, రాచకొండలో చిక్కుతున్న ‘మత్తు’ డ్రైవర్లు

ఐదు నెలల్లో 11,411 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు

అత్యధికులు ప్రైవేట్‌ ఉద్యోగులే.. ఆపై విద్యార్థులు

చిక్కేది 70 శాతం ద్విచక్ర వాహనదారులే  

తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష

అయినా పెద్దగా కనిపించని మార్పు  

మద్యం తాగాక వాహనం నడపొద్దని ఎవరైనా అంటే ‘మత్తు’ బాబులకు చిర్రెత్తుకొస్తుంది. ‘టాట్‌.. ఫుల్‌ తాగినా పూర్తి కంట్రోల్‌లో ఉండే బాడీ నాది’ అంటూ కచ్చితంగా బండి తీసి తీరాల్సిందేనంటారు. అదే మత్తులో నగరంతో పాటు శివారుల్లో రయ్‌మనిదూసుకెళ్తూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిపోతున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉండడం గమనార్హం. జరిమానా విధిస్తున్నా.. జైళ్లకు పంపిస్తున్నా సరే వారిలో మార్పు రావడం లేదు. ఎందుకంటే ప్రతినెలా నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. రాత్రి వేళల్లోపోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో మందుబాబులు ఇబ్బడిముబ్బడిగా పట్టుబడుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నా డ్రంకన్‌ డ్రైవర్ల సవారీని నియంత్రించ లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకుసైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 11,411 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ద్విచక్ర వాహనాలదే జోరు
డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కుతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ. తాగి వాహనం నడిపే వారిలో యువతే ఎక్కువగా ఉండడంతో సహాజంగానే ఈ తరహా వాహనాలను అధికంగా వినియోగిస్తున్నారు. మొత్తం డ్రంకన్‌ డ్రైవర్లలో 70 శాతం మంది యువతే ఉంటున్నారు. వృత్తుల వారీగా చూస్తే ప్రైవేట్‌ ఉద్యోగులే మొదటి స్థానాన్ని అక్రమిస్తున్నారు. తర్వాత స్థానంలో విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం వీరికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇక మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోమని మద్యం తాగి వాహనాలు నడపడంలో తమ సంఖ్య పెంచుకుంటున్నారు.

బీఏసీ 550 ఎంజీ స్థాయిలోనూ డ్రైవింగ్‌
సాధారణంగా తనిఖీల సందర్భంగా వాహనదారుడి నోటి వద్ద బ్రీత్‌ అనలైజర్‌ పైప్‌ను పెట్టి ఊదిస్తారు. రక్తంలో మద్యం నిల్వల (బ్లడ్‌ ఆల్కహాలిక్‌
కంటెంట్‌–బీఏసీ) స్థాయి ఎంత ఉందనే విషయం దీన్ని బట్టి లెక్కిస్తారు. 100 ఎంఎల్‌ రక్తంలో బీఏసీ స్థాయి 30 ఎంజీ కంటే తక్కువగా ఉంటే వదిలేస్తారు. ఆ స్థాయిని మంచితే కేసు నమోదుచేసి కోర్టుకు పంపిస్తారు. గణాంకాల ప్రకారం చిక్కిన వారిలో 100–300 ఎంజీ స్థాయి ఉన్నవారే అధికంగా ఉంటున్నారు. 30–100 ఎంజీ స్థాయి వారిది రెండో స్థానం. మరోవైపు 550 ఎంజీ ప్రమాదకర స్థాయి దాటిన వారు కూడా వాహనాలు నడుపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు అస్కారముంటుందని నిపుణులు చెబుతున్నారు.  

కౌన్సెలింగ్‌ కీలకం
ప్రస్తుతం కేసుల్లో చిక్కుతున్న వారిలో పరివర్తన తీసుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు కౌన్సెలింగ్‌ కీలకపాత్ర పోషించాలి. ప్రస్తుతం మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారిని తొలుత ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలోకి తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. తాగి నడిపితే ఎదురయ్యే పర్యవసనాలు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబ సభ్యులకు ఎదురయ్యే నష్టాలపై జాగృతి కలిగిస్తున్నారు. మరోవైపు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన హృదయ విదారక ప్రమాద దృశ్యాలను చూపించి వారిలో జీవితంపై ఆలోచనలు రేకెత్తించి మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  

మానసిక పరిస్థితిని బట్టికౌన్సెలింగ్‌ 
తాగి వాహనంనడుపుతూ దొరికేవారిలో కొందరు కొన్ని సందర్భాల్లో తప్పనిసరైతాగేవారు ఉంటున్నారు. ‘మేం దొరకంలే’ అనే ధైర్యంతో వీరు తాగి వాహనం నడుపుతూ చిక్కిపోతున్నారు. ఒకసారి చిక్కాక చాలామంది మరోసారి తాగి నడపడం లేదు. ఇక రెండోరకం వారు అందరిలో తాము ప్రత్యేకంగా ఉండాలని అడ్వెంచర్లు చేస్తుంటారు. మూడోరకం ఎవరూ ఏమీ చేయలేరన్న అతి అతి విశ్వాసంతో ఉంటారు. పోలీసులకు పట్టుబడితే తప్పించుకోవచ్చులే అని హీరోయిజం చూపేవాళ్లు కూడా ఉన్నారు. మొదటి రకం పోలీసులకు చిక్కగానే బాధపడబి ఒత్తిడికి గురవుతారు. తామేదో నేరం చేసినవాళ్లుగా ఫీలవుతారు. వీరి మానసిక పరిస్థితిని బట్టి కౌన్సెలింగ్‌ ఒక రకంగా ఇవ్వాలి. అలాగే మిగతా మూడు రకాలకు చెందిన డ్రంకన్‌ డ్రైవర్ల సైకాలాజికల్‌ను గమనించి భవిష్యత్‌లో మళ్లీ చేయకుండా ఉండేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.   – డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి,మానసిక వైద్య నిపుణుడు

క్రిమినల్‌ కేసులకు వెనుకాడం
డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు ఇప్పుడు ప్రతి రోజు పగలు, రాత్రి కూడా చేస్తున్నాం. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. వాటి సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లను కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇటీవల ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించకుండా డ్రంకన్‌ డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. రోడ్డు ప్రమాదాలను నియంత్రిస్తూ మరణాలను తగ్గించాలనేదే మా ప్రయత్నం.
– ఎస్‌.విజయ్‌కుమార్, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

సైబరాబాద్‌ పరిధిలో పోలీసులకు పట్టుబడినడ్రంకన్‌ డ్రైవర్లలో ఉద్యోగులు, ఇతరులు ఇలా..

(రాచకొండ పరిధిలో ఐదు నెలల్లో 2,675 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 52 మంది ప్రైవేట్‌ ఉద్యోగులు, 44 మంది విద్యార్థులు, 30 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top