ఉద్దేశ పూర్వకంగా నన్ను దోషిని చేశారు
సాక్షి. అచ్చంపేట(మహబూబ్ నగర్): అచ్చంపేట కమ్యూనిటీ అస్పత్రిలో కాన్పుకోసం వచ్చిన నిండు గర్భిణి స్వాతి ప్రసవం సయయంలో శిశువు తలను వేరు చేసిన ఘటనలో తన ప్రమేయం ఏమాత్రం లేదని డ్యూటీ డాక్టర్ సుధారాణి అన్నారు. సోమవారం అచ్చంపేట అస్పత్రి ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్వాతి ప్రసవం కోసం వచ్చిన విషయం తనకు తెలియదని, ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్లు తారాసింగ్, సిరాజ్లు ప్రసవం చేశారని చెప్పారు. కాన్పు సమయంలో తన ప్రమేయం లేకపోయినా డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సిరాజ్లు చేసిన నిర్వాకం వల్ల ఈ సంఘటన జరిగిందని, తనను బలిపశువు చేశారని ఆరోపించారు. శిశువు తల దాచిన విషయం కూడా తెలియదని, ఆరోజు డ్యూటీ మీదే కాదా మేడమ్ చెప్పండి అంటే చెప్పానన్నారు.
మహిళా వైద్యురాలిని కావడంతో నాపేరు బయటకు పొక్కెలా వారు పకడ్బందీగా నన్ను ఇరికించే ప్రయత్నం చేశారని, వాస్తవాలు పరిశీలిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పారు. వారి నిర్వాకం వల్ల శిశువు తల తెగిపోయిందని, నా ప్రమేయం లేకుండానే స్వాతి పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్ సిరాజ్ రెఫర్ చేస్తూ లెటర్ రాసి హుటాహుటిన హైదరాబాద్కు చికిత్స కోసం పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనని అకారణంగా విధుల నుంచి తొలగించారని, ఇందుకు కారణమైన అస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సిరాజ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.