నా పెళ్లికి అప్పులు చేయొద్దు..
మనోవేదనతో యువతి ఆత్మహత్యాయత్నం
గోపాల్పేట (వనపర్తి): తన పెళ్లి కోసం అప్పులు చేస్తున్నారని.. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇది మరింత భారం అవుతుందనే మనోవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా.. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. వనపర్తి జిల్లా గోపాల్పేటకు చెందిన బోడోల్ల నాగయ్య–పెంటమ్మ కుమార్తె స్రవంతి (19)కి ఈనెల 21వ తేదీన నాగర్కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన రాజేశ్తో పెళ్లి నిశ్చయించారు.
అయితే, తల్లిదండ్రులు పెళ్లికోసం అప్పులు చేయాల్సి రావడంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వారికి తన పెళ్లి మరింత కష్టం తెచ్చిపెట్టిందని భావించిన స్రవంతి ఆదివారం అర్ధరాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీనిని గమనించిన తండ్రి, సోదరుడు మంటలను అదుపు చేసి అంబులెన్స్లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె 80 శాతం కాలిపోవడంతో వైద్యులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి పంపించారు. అక్కడ ఆమె నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని సేకరించారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు.