కన్నతల్లిని చంపి మారువేషంలో..
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో నెల రోజుల కిందట 50 సంవత్సరాల మహిళ హత్యకు గురైన ఉదంతంలో హత్య మిస్టరీని ఢిల్లీ పోలీసులు చేధించారు. పోలీసులు దర్యాప్తులో కన్నతల్లిని ఆమె కుమారుడే దారుణంగా హత్య చేశాడని వెల్లడైంది. డ్రగ్స్కు బానిసైన నిందితుడు తన తల్లిని డబ్బులు అడగ్గా ఇవ్వలేదనే కోపంతో ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు చెప్పారు. కన్నతల్లిని హత్య చేసిన అనంతరం తనను ఎవరూ గుర్తించకుండా, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో తన రూపాన్ని మార్చివేశాడు. గడ్డం, మీసాలు పెంచుకుని యూపీలోని మోదీ నగర్లో అనాథగా తిరుగుతున్నాడని అశుతోష్గా గుర్తించిన అతడిని అదే ప్రాంతంలో అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. దేవాలయాలు, రైల్వే స్టేషన్ల వద్ద నిందితుడు డబ్బులు, ఆహారం, దుస్తులు అడుక్కుంటూ కనిపించాడని చెప్పారు. నిందితుడు ఫోటో, వివరాలతో కూడిన పాంప్లెట్లను అనుమానాస్పద ప్రాంతాల్లో అంటించగా అతను మోదీ నగర్లో ఉన్నట్టు సమాచారం అందిందని డీసీపీ సూర్య తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు.