సమాధిని తవ్వి తల ఎత్తుకెళ్లి..
దొడ్డబళ్లాపురం : శ్మశానంలో పూడ్చిన శవాన్ని బయటకు తీసిన దుండగులు.. తల తీసుకుపోయిన సంఘటన నెలమంగల తాలూకా భైరనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. భైరనహళ్లి గ్రామం నివాసి అరసయ్య(65) వయోభారంతో జనవరి 13న మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని శ్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని బయటకు తీసి తల కత్తిరించుకుని వెళ్లిపోయారు.
బుధవారం శ్మశానం వైపు వెళ్లిన స్థానికులు తల లేని శవాన్ని చూసి భయాందోళనకు గురై నెలమంగల రూరల్ పోలీసులకు సమాచార మిచ్చారు. వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చిపెట్టారు. బుధవారం అమావాస్య కావడంతో చేతబడి కోసం మాంత్రికులు ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.