దేవుడా కరుణ చూపలేదా?

Daughter Died In Parenrts Controversy - Sakshi

భార్యాభర్తల మధ్య వివాదంలో చిన్నారి మృతి

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన వైనం

మెట్టూరులో విషాదం?

కొత్తూరు: కాపాడవల్సిన తండ్రే అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారకుడయ్యాడు. ఈ సంఘటన మండలంలోని మెట్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీస్‌లు చెప్పిన వివరాలు ప్రకారం... మెట్టూరు బిట్‌–2 పునరావాస కాలనీలో పెద్దమడి నిర్వాసిత గ్రామానికి చెందిన జమ్మాన సింహాచలం భార్య అన్నపూర్ణ  పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే సింహాచలం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని భార్య అనుమానించడంతో భార్యాభర్తల మధ్య నిత్యం వివాదం జరుగుతుండేది. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీన మళ్లీ వివాదం చెలరేగింది. భర్త ప్రవర్తన మారకపోవడంతో పాటు మానసికంగా, శారీరక వేధింపులు తట్టుకోలేక చివరకు భార్య అన్నపూర్ణ తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని వరుసకు అన్నయ్య అయిన మెట్టూరుకు చెందిన యిజ్జల రమేష్‌ ఇంటికి వెళ్లి తలదాచుకుంది.

అయితే 17వ తేదీ రాత్రి మెట్టూరులోని రమేష్‌ ఇంటిలో ఉన్న తన భార్య వద్దకు సింహాచలం వచ్చాడు. భర్త వస్తున్నాడని గమనించిన భార్య అన్నపూర్ణ ఇంటి నుంచి వీధిలోకి దూరంగా వెళ్లిపోయింది. అప్పటికే మద్యం సేవించి వచ్చిన సింహాచలం అక్కడ ఉన్న తన రెండో కుమార్తె కరుణ(4)ను అదుపులోకి తీసుకొని రెండు కాళ్లు పట్టుకొని కిందకేసి బలంగా కొట్డాడు. దీంతో చిన్నారి కరుణ తలకు తీవ్రంగా గాయాలు తగలడంతో కొత్తూరులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతూ సోమవారం చిన్నారి కరుణ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. మెట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి తల్లి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top