పసిమొగ్గపై పశుత్వం
ముక్కుపచ్చలారని పసిమొగ్గలు వాడిపోతున్నాయి. మానవ మృగాల వేటలో వసివాడిపోతున్నాయి. అది కశ్మీర్ అయితేనేం కన్యాకుమారి అయితేనేం. ఆసిఫా భానూ అయితేనేం.. ఆయేషా అయితేనేం.. పాలుగారే పసిబిడ్డలను నుసిచేసే రాక్షసత్వం.. కోరలుచాచి విజృంభిస్తోంది. కులమో, మతమో, కండకావరమో ఏదైతేనేం.. అన్నీ కలిస్తే పసిమొగ్గలను తుంచేస్తున్నాయి. పండుముదుసలిని వదలని పశుత్వం.. కన్నతల్లినీ, చిట్టి చెల్లినీ చూడని నీచత్వం విలయతాండవం చేస్తోంది.
చీకటి పడితే కాదు.. పట్టపగలే.. విశృంఖల నాట్యం చేస్తోంది. ఇల్లు, పల్లె, గుడి, బడి ప్రతిదాని చాటునా రక్తసిక్తమవున్నది మాత్రం పసి మనసులే. హత్యాచారాలతో ఆసేతు హిమాచలం.. గొంతుపెగలక మూగగా రోదిస్తోంది. ఒకప్పుడు దేశంలో ఆడపిల్లలకు భద్రమైన చోటు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తే ముంబై వైపు వేలు చూపించేవారంతా. అందుకే ముంబై నగరాన్ని ‘సేఫ్ సిటీ’ గా పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు ముంబై ‘సేఫ్ సిటీ’ ట్యాగ్ మసకబారింది. మహారాష్ట్రలో స్త్రీలపై హింస పెరిగినట్టు క్రైమ్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
♦ మహారాష్ట్రలో రోజుకు 12 మంది మహిళలు అత్యాచారాలకు బలవుతున్నట్టు గత ఏడాది స్టేట్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్రలో రోజుకు 30 మంది స్త్రీలు ఏదో రకమైన లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
♦ గత ఏడాదిలో మహారాష్ట్రలో 4,356 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఇందులో 20 శాతం మంది ముంబై నగరానికి చెందినవారే. నమోదైన లైంగిక వేధింపుల కేసులు 12,238 అయితే.. ఇందులో 15 శాతం ముంబైలో జరిగినవే.
♦ ముంబై పోలీసుల గణాంకాల ప్రకారం గత ఏడాది నగరంలో 751 మంది స్త్రీలు అత్యాచారానికి గురయితే.. అందులో 284 మంది పసిమొగ్గలు, మైనర్లే.
♦ మహారాష్ట్రలో గత ఏడాది 32,100 మహిళలకు సంబంధించి హింస కేసులు నమోదయ్యాయి. 2017.. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 2,300 మంది పసిపిల్లలపై అత్యాచారాలు జరిగాయి.
♦ గత మూడేళ్లలో మహారాష్ట్రలో మహిళల కిడ్నాప్ కేసులు గణనీయంగా పెరిగాయి. 2015లో 5,090 కిడ్నాప్ కేసులు నమోదైతే.. 2017కి వచ్చేసరికి ఆ సంఖ్య 7,113 పెరిగి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో 1,292 కేసులు ముంబైలో నమోదైనవే కావడం గమనార్హం.
♦ ఢిల్లీలో అత్యధికంగా 14,661 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. ఇందులో 6,125 మంది మగపిల్లలు, 8,536 మంది ఆడపిల్లలు.
♦ ఢిల్లీ తర్వాతి స్థానం మధ్యప్రదేశ్దే. మధ్యప్రదేశ్లో 12,068 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. ఇందులో 3,446 మంది బాలురు, 8,622 మంది బాలికలు.
4,700
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2016లో 4,700 మంది చిన్నారులు కనిపించకుండా పోయారు. ఇందులో 1,021 మందిని మాత్రమే కనిపెట్టగలిగారు. గుర్తించిన వారిలో 377 మంది మగపిల్లలు, 644 మంది బాలికలు.
3,324
ఆంధ్రప్రదేశ్లో 3,324 మంది, తమిళనాడులో 8,501 మంది చిన్నారులు కనపడకుండా పోయారు.