అన్యోన్య దాంపత్యాన్ని కాటేసిన మృత్యువు

Couples Died In Road Accident - Sakshi

రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం

చికిత్స పొందుతూ భార్య మృతి  

సైదాపురంలో విషాదచాయలు

సైదాపురం: పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులను మృత్యువు కాటేసింది. సోమవారం బంధువులతో కలిసి దైవ దర్శనానికి వెళ్తుండగా ఆటోను ట్రాక్టర్‌ ఢీకొన్న దుర్ఘటనలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మండలంలోని రామసాగరం గ్రామానికి చెందిన కె.రవీంద్రబాబు (40) అదే గ్రామానికి చెందిన గిరిజన మహిళ కుడుముల చెంచమ్మ అలియాస్‌ శ్రావణి (35)ని పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఏడేళ్లుగా సైదాపురంలోని ఎంఎస్‌ కాలనీలో కాపురం ఉంటున్నారు. సొంతగా ఆటోను నడుపుకుంటూ భార్యాభర్తలు ఆనందంగా ఉన్నారు. ప్రతి సోమవారం డక్కిలి మండలంలోని దేవుని వెల్లంపల్లిలో ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమవారం రవీంద్రబాబు భార్య చెంచమ్మ, ఇంటి పక్కనే ఉంటున్న రాపూరు లక్ష్మమ్మ, ఆమె మనుమడు శ్రీనివాసులతో కలిసి ఆటోలో బయలుదేరారు. రాపూరు మండలం జోరేపల్లి వద్ద ఎదురుగా ట్రాక్టర్‌ ఆటోను ఢీకొనడంతో రవీంద్రబాబు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఈ  చెంచమ్మ, లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే చెంచమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. అన్యోన్యంగా ఉన్న ఆ జంట రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top