మనస్తాపంతో దంపతుల ఆత్మహత్యాయత్నం
నెక్కొండ(నర్సంపేట): కూతురు ప్రేమికుడితో వెళ్లిపోయిందని మనస్తాపం చెందిన ఆ తల్లిదండ్రులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. చంద్రుగొండ గ్రామానికి చెందిన మల్లయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె రెండు రోజుల క్రితం(సోమవారం మధ్యాహ్నం) నుంచి కనబడడంలేదు. మల్లయ్య దంపతులు బంధువులను ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉదయం నెక్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చిన ఆ దంపతులకు తమ కుమార్తె అదే గ్రామానికి చెందిన బక్కి రమేష్ అనే యువకుడితో ప్రేమలో పడిందని తెలుసుకున్నారు.
అనంతరం తమ కూతురు ఇష్ట పూర్తిగానే వెళ్లిందని భావించి మల్లయ్య దంపతులు మనస్తాపానికి గురై బుధవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. స్థానికులు గుర్తించి వారిని చికిత్స నిమిత్తం నెక్కొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నెక్కొండ ఎస్సై మిథున్ ఆస్పత్రికి చేరుకొని ఆ దంపతుల ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మల్లయ్య దంపతులను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.