ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
కృష్ణా జిల్లాలో ఘటన..
మృతులు తెనాలి వాసులు
ఆగిరిపల్లి(నూజివీడు): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా, ఆగిరిపల్లి మండలంలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటకు చెందిన కొల్లూరు బాలప్రసాద్ (63), ప్రసన్నలక్ష్మి (55)దంపతులు. బాలప్రసాద్ కందుల వ్యాపారం చేసేవాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పద్మప్రియను హైదరాబాద్కు చెందిన వెంకటరత్నశేఖర్తో, రెండో కుమార్తె మహాలక్ష్మిగాయత్రిని మేనల్లుడైన తెనాలికే చెందిన హర్షవర్థన్కు ఇచ్చి వివాహం చేశారు.
కందుల వ్యాపారంలో పెద్దమొత్తంలో నష్టపోవడంతో బాలప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 13న షిర్డీ యాత్రకని చెప్పి బాలప్రసాద్, ప్రసన్నలక్ష్మి ఇంటి నుంచి బయల్దేరారు. అయితే వారు కృష్ణాజిల్లా, ఆగిరిపల్లి మండలంలోని నెక్కలంగొల్లగూడెం గ్రామం వద్ద ఓ పారిశ్రామిక సంస్థ ఎదురుగా ఉన్న ముళ్ల పొదల్లో శనివారం ఉదయం విగత జీవులై కనిపించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఎం.లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల వద్ద లభించిన బ్యాగుల్లో దొరికిన సెల్ఫోన్ల ఆధారంగా వారి బంధువులకు సమాచారాన్ని చేరవేశారు. భార్యాభర్తలిద్దరూ కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి మృతి చెందారని ఎస్ఐ తెలిపారు.