దంపతుల ఆత్మహత్య

Couple Commit Suicide in West Godavari - Sakshi

పోతినీడుపాలెంలో విషాదం

పశ్చిమగోదావరి, దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతీనీడుపాలెంలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, భర్తలేకపోతే తాను బతకడం కష్టమని భావించిన భార్య ఇద్దరూ కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.  పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గొల్లగూడేనికి చెందిన జ్యోతి(27)ని నల్లజర్ల మండలం పోతినీడుపాలేనికి చెందిన సోము విష్ణుమూర్తి(32)కి ఇచ్చి 2009లో వివాహం చేశారు. వీరిద్దరూ జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. విష్ణుమూర్తి జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు వ్యాపార సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.  విష్ణుమూర్తి గుండెజబ్బుతో బాధపడుతున్నారు.

ఎంతోకాలం బతకడని వైద్యులు చెప్పడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది.  అనారోగ్యంతో భర్త చనిపోతే తాను ఒంటరిగా బతకలేనని భావించిన జ్యోతి భర్తతోపాటు తానూ చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ జంగారెడ్డిగూడెం నుంచి మోటారు సైకిల్‌పై పోతినీడుపాలెం వచ్చి అక్కడి నుంచి గ్రామ శివారులోని తమ సొంత పొలంలోని బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అనంతరం ఇద్దరు కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలకు బయటకుతీశారు. పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్‌ విలేకర్లకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top