హిజ్రాతో గొడవ.. అడ్డుపడిన అమ్మాయిని..
ముంబై : హిజ్రాతో గొడవపడొద్దంటూ అడ్డుకున్న ఓ కాలేజీ యువతిపై చేయి చేసుకోవటమే కాకుండా, రైలులోంచి కిందకు తోసేశాడో వ్యక్తి. ఈ సంఘటన ముంబైలోని మహీమ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలీ నౌషద్ షేక్ అనే వ్యక్తి గత కొద్దినెలలుగా ఓ హిజ్రాతో ప్రేమలో ఉన్నాడు. బుధవారం నాడు ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది. దీంతో హిజ్రా అలీకి దూరంగా ఉండటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం హిజ్రా ఓ ట్రైన్లోని లేడీస్ కోచ్లో ఎక్కింది. ఆ ట్రైన్ కొద్దిసేపటి తర్వాత మహీమ్ స్టేషన్కు చేరుకుంది. అదే సమయంలో స్టేషన్లో ఉన్న అలీ హిజ్రా ఉన్న లేడీస్ కోచ్లోకి ఎక్కాడు. అనంతరం హిజ్రాను బూతులు తిడుతూ కొట్టడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న మహిళలు అతడిని వద్దని వారించారు. అయినా అతడు వినలేదు. అక్కడే ఉన్న ఓ 18 ఏళ్ల కాలేజీ యువతి హిజ్రాకు అండగా నిలబడి, షేక్ను అడ్డుకుంది.
ఆగ్రహంతో ఊగిపోయిన అలీ ఆ యుతిని చెంపదెబ్బకొట్టడమే కాకుండా బూతులు తిట్టాడు. దీంతో అక్కడి మహిళలు అతడిపై విరుచుకుపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోయిందని భావించిన అలీ ఓ స్టేషన్ వద్ద ట్రైన్ దిగి అక్కడినుంచి పారిపోవటానికి ప్రయత్నించాడు. సదరు యువతి డోర్ దగ్గర అడ్డుగా నిలబడి అతడ్ని బయటకు వెళ్లనీయలేదు. దీంతో అతడామెను ప్లాట్ఫామ్పైకి తోసి, అక్కడినుంచి పరుగులు తీశాడు. మహిళలు గట్టిగా అరవటంతో రైల్వేపోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రైలు.. ప్లాట్ఫామ్పై మెల్లిగా వెళుతుండటంతో యువతికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.