దోపిడీ దొంగల కాల్పుల్లో సీఐ మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని ఓ బంగారు నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన దొంగలముఠాను పట్టుకునేందుకు రాజస్థాన్ వెళ్లిన సీఐ పెరియపాండి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇన్స్పెక్టర్, ఐదుగురు పోలీసులు తీవ్ర గాయాలపాలై రాజస్థాన్లో చికిత్స పొందుతున్నారు. చెన్నై శివారు లక్ష్మీపురం కడప రోడ్డులోని మహాలక్ష్మి జ్యూవెలరీస్లో గత నెల 16న దొంగలు ప్రవేశించి 3.5 కిలోల బంగారు నగలు, 4.5 కిలోల వెండి, రూ.2లక్షల నగదు దోచుకెళ్లారు.
రాజస్థాన్కు చెందిన నాదూరాం, దినేష్ చౌదరి అనే పాత నేరస్థులే ఈ దోపిడీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. వీరిని పట్టుకునేందుకు చెన్నై కొళత్తరు ఇన్స్పెక్టర్ పెరియపాండి, మరో సీఐ మునిశేఖర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దోపిడీతో సంబంధం ఉన్నవారిని రాజస్థాన్లో అరెస్ట్ చేసి చెన్నైకి తెచ్చారు. వీరిచ్చిన సమాచారంతో ఈనెల 8న పెరియపాండి, మునిశేఖర్ రాజస్థాన్ వెళ్లి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున నిందితులు దాక్కుని ఉన్న ఇంటిని చుట్టుముట్టి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న దొంగలు పోలీసులపై తూటాల వర్షం కురిపించడంతో సీఐ పెరియపాండి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో సీఐ మునిశేఖర్, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ సహాయ కమిషన్ ముకేష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రాజస్థాన్కు పంపారు.