చిన్నారి కిడ్నాప్ కేసులో..
వీడిన మిస్టరీ
చిక్కడపల్లి: బాగ్లింగంపల్లిలో జరిగిన చిన్నారి కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. పిల్లలు లేని కారణంగా చిన్నారిని పెంచునేందుకు తీసుకెళ్లినట్లు నిందితురాలు పేర్కొంది. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో మధ్యమండలం డీసీపీ విశ్వప్రసాద్ వివరాలు వెల్లడించారు. గత నెల 29న బాగ్లింగంపల్లి ఈడబ్ల్యూ క్వార్టర్స్కు చెందిన రమేష్, సంగీత దంపతుల కుమార్తె మౌనిక ఇంటి బయట అడుకునేందుకు వెళ్లి అదృశ్యమైంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ ఆంజనేయలు బృందం సీసీ కెమెరా పుటేజీ ద్వారా ఆధారాలు సేకరించారు. దీంతో అదే ప్రాంతానికి చెందిన సునీత అనే మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
అయితే సదరు మహిళ తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లినట్లు సమాచారం అందడంతో ఎస్ఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ నాగరాజు, మహిళా కానిస్టేబుల్ ప్రియాంకతో కలసి ఈ నెల 6న అక్కడికి వెళ్లి నిందితురాలితో పాటు చిన్నారిని నగరానికి తీసుకువచ్చారు. అయితే తనకు రెండు పెళ్లిళ్లు జరిగాయని, భర్తలిద్దరూ తనను వదిలేయడంతో ఒంటరిగా ఉన్న తోడుగా ఉంటుందని మౌనికను నెత్తుకొచ్చినట్లు తెలిపింది. కిడ్నాప్లో ఆమెకు సహకరించిన పోలవరానికి చెందిన పెంటారావుతో పాటు సునీతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కేసును చేధించిన ఎస్ఐ ఆంజనేయులు బృందాన్ని డీసీపీ అభినందించారు.