పెళ్లి చేసుకుంటానని మోసం
రాజేంద్రనగర్: వివాహ పరిచయ వేదిక ద్వారా పరిచయం ఓ యువతిని పరిచయం చేసుకున్న యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని లోబర్చుకొని ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ఆ యువతిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్కు చెందిన ఓ తండ్రి తన కూతురు వివాహం చేసేందుకు మంచి సంబంధం కోసం వివాహ పరిచయ వేదికను సంప్రదించాడు. కూతురు పూర్తి సమాచారాన్ని ఫొటోను పరిచయ వేదికకు అందజేశారు. ఈ పరిచయ వేదికను ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన సాయినాథ్(26) సందర్శించి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారినని పరిచయం చేసుకొని అత్తాపూర్ ప్రాంతానికి చెందిన యువతి వివరాలను తీసుకున్నాడు.
ఇరువురి కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరుపుకున్నారు. ఒకరికొకరు నచ్చారు. దీంతో ఇరు కుటుంబాల వారు వివాహం చేసేందుకు నిర్ణయించారు. మరో నాలుగైదు నెలల్లో వివాహం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ సమయంలో సాయినాథ్ ఆ యువతిని గుడికి, సినిమాలు, పార్కులు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లడం.. ఇంట్లో దిగబెడుతుండేవాడు. వీరిద్దరి మద్య బంధం బలపడడంతో ఆ యువతిని సాయినాథ్ శారీరకంగా లొంగదీసుకున్నాడు. 25 రోజు ల క్రితం వివాహ ప్రస్తావన తెగా.. తాను చేసు కోనని ఆ యువతి నచ్చలేదంటూ ముఖం చాటేశాడు. అంతగా పట్టించుకోని ఆ యువతి మరుసటి రోజు ఫోన్ చేయగా స్పందించడం లేదు. తనకు ఫోన్ చేయవద్దని వేరే యువతిని వివాహం చేసుకోనున్నట్లు ఆమెతో చెప్పాడు. దీంతో మనస్తాపానికి చెందిన ఆ యువతి గుర్తుతెలియని మాత్రలను మింగింది. అపస్మారకస్థితికి చేరుకున్న యువతిని కుటుంబం సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టులాడిన ఆ యువతిని డాక్టర్లు ఎట్టకేలకు రక్షించారు. కొలుకున్న అనంతరం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయినాథ్ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.