బిగుస్తున్న ఉచ్చు!
పెక్ ఇండియా కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు
ఇప్పటికే శైలేష్ సక్సేనతో పాటు మరొకరి విచారణ
అవసరమైన వివరాలు బయటపడలేదంటున్న వైనం
త్వరలో అరెస్టులకు సన్నాహాలు
మరికొందరు ప్రముఖుల ప్రమేయంపై అనుమానాలు
సాక్షి, సిటీబ్యూరో: భోజగుట్ట సహా నగరంలోని రూ.వందల కోట్ల భూములకు ‘పేపర్ యజమాని’గా ఉండి గత ఏడాది మృతి చెందిన మావూరి శివభూషణం నిందితుడిగా ఉన్న పెక్ ఇండియా కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. భోజగుట్ట ల్యాండ్స్కామ్లో నిందితులుగా ఉన్న వారి ప్రమేయాన్ని అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేపట్టింది. భోజగుట్ట స్కామ్లో నిందితుడిగా ఉండి అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనల ద్వారా రంగంలోకి దిగిన శివభూషణం పేరుతో భూ కబ్జాల కోసం సృష్టించిన నకిలీ చిరునామాలే పెక్ ఇండియాను మోసం చేయడానికీ వాడారు. పెక్ ఇండియా సంస్థను రూ.531 కోట్లు మోసం చేసిన ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ విభాగం గత ఏడాది వివిధ సంస్థలు, వ్యక్తులతో సహా 15 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో ఏడో నిందితుడిగా శివభూషణం, ఎనిమిదో నిందితుడిగా ఎం.శ్రీనివాస్ ఉన్నారు. గోషామహల్లోని చిరునామాలను వీరికి చెందినవిగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనలతో కలిసి సిటీలో భూ కబ్జాల కోసం సృష్టించిన నకిలీ పత్రాల్లో మావూరి శివభూషణం పేర్కొన్న చిరునామాల్లో ఈ గోషామహల్ చిరునామా కూడా ఒకటి.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ది ప్రాజెక్టŠస్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ (పెక్) ఇండియా లిమిటెడ్ దేశంలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారం చేసే వారికి గ్యారంటర్గా వ్యవహరిస్తుంది. ముంబైకి చెందిన ప్రైసీస్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, జెట్లింక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 2010–12 మధ్య పెక్తో ఒప్పందాలు చేసుకుని రూ.348 కోట్లు ఆర్థిక సాయం తీసుకున్నాయి. ఇవి 2016 నాటికి పెక్కు వడ్డీతో కలిపి రూ.531 కోట్లు బకాయిపడ్డాయి. అప్పుడే థర్డ్ పార్టీ హోదాలో హైదరాబాద్కు చెందిన శివభూషణం అనే వ్యక్తి రంగ ప్రవేశం చేశాడు. కొత్వాల్గూడలో తనకు ఉన్న 1820 ఎకరాలను హామీగా పెడుతున్నానంటూ పత్రాలు దాఖలు చేశాడు. దీనిని అమ్మి బకాయిలు తీర్చుకునేందుకు పెక్ ఉపక్రమించడంతో అడ్డం తిరిగిన శివభూషణం రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఇచ్చిన స్థలం పత్రాలు పరిశీలించిన పెక్ నకిలీవిగా తేల్చింది. ఈ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు చేయగా... హైదరాబాద్కు చెందిన ముగ్గురితో పాటు సంస్థలు, వ్యక్తులు కలిపి 15 మందిపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో ఎం.శివభూషణంగా చెప్పుకున్న వ్యక్తి చిరునామా ‘హౌస్ నెం.14–2–327, గోషామహల్, హైదరాబాద్గా సీబీఐ పేర్కొంది.
ఇదే ఆ ఎం.శివభూషణం... దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనలు రంగంలోకి దింపిన మావూరి శివభూషణం ఒక్కరే అని అనుమానించడానికి కారణమైంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఖరీదైన స్థలాలను కబ్జా చేయడానికి శైలేష్ సక్సేన, దీపక్రెడ్డి నకిలీ పత్రాలతో పాటు బోగస్ వ్యక్తులను రంగంలోకి దింపారు. అలాంటి వారిలో మావూరి శివభూషణం కూడా ఒకరు. ఈ బోగస్ వ్యక్తుల ద్వారా ఏ కోర్టులో పిటిషన్ వేయించాలన్నా... ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేయించాలన్నా అడ్రస్ అవశ్యం. పిటిషన్ దాఖలు చేయించేది బోగస్ వ్యక్తులతో కావడంతో ఈ ముఠా కొన్ని చిరునామాలనూ సృష్టించింది. సదరు పత్రాలను పరిశీలించిన పోలీసులు వీరు ప్రధానంగా ఆరు చిరునామాలను వాడినట్లు తేల్చారు. ఆ ఆరింటిలో ‘హౌస్ నెం.14–2–327, గోషామహల్, హైదరాబాద్’ కూడా ఒకటి. ఈ చిరునామా సారూప్యతను పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు సీసీఎస్, సీబీఐ కేసుల్లో ఉన్న శివభూషణాలు ఒకరిగా అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని లోతుగా ఆరా తీసిన సీబీఐ నిందితుల్లో ఒకరిగా నిర్ధారించింది. అయితే అతడిని విచారించే లోపే చనిపోయాడు. దీంతో శ్రీనివాస్తో పాటు శైలేష్ సక్సేనను రెండుసార్లు సీబీఐ అధికారులు విచారించారు. శైలేష్ నుంచి తమకు అవసరమైన సమాచారం రాలేదని సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఆయనకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ స్కామ్ వెనుక ఉన్న పెద్దమనుషుల వివరాలూ ఆరా తీయాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.