ఇల్లు గుల్ల చేసి ప్రియుడితో పరార్
అన్నానగర్: మార్తాండంలో పారిశ్రామికవేత్త భార్య బుధవారం 150 సవర్ల నగలతో ప్రియుడితో పరారైంది. కన్యాకుమారి జిల్లా మార్తాండానికి చెందిన పారిశ్రామికవేత్త (50). ఆ ప్రాంతంలో ఫైనాన్స్ సంస్థ నడుపుతూ వస్తున్నాడు. ఇతనికి భార్య (40), ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరి ఇంటి సమీపంలో రాజకీయ ప్రముఖుడు (37) కొయ్యల వర్క్షాపు నడుపుతున్నాడు. ఇతనికి వివాహం జరిగి భార్య, పిల్లలు ఉన్నారు. పారిశ్రామికవేత్త, రాజకీయ ప్రముఖుడి వద్ద వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఉన్నాయి.
ఇందుకోసం రాజకీయ ప్రముఖుడు తరచూ పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో అతని భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియగానే పారిశ్రామికవేత్త వారిని మందలించాడు. ఈ స్థితిలో బుధవారం పారిశ్రామికవేత్త భార్య ఇంట్లో ఉన్న 150 సవర్ల నగలు, నగదుతో అదృశ్యమైంది. ఆమె ప్రియుడితో కలిసి పరారైనట్లు విచారణలో తెలిసింది. దీనిఫై ఫిర్యాదు అందుకున్న మార్తాండం పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.