రెండు నెలల్లో 70 గేదెలు మాయం
దొంగలించి వేరేప్రాంతాలకు తరలింపు
దొంగలను పట్టుకొన్న గ్రామస్తులు
సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : గేదెలను అపహరిస్తున్న దొంగలను మండలంలోని పుట్లగూడెం గ్రామస్తులు పట్టుకుని బుధవారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండు మూడు నెలలుగా మండలంలో గేదెల దొంగతనాలు ఎక్కువయ్యాయి. రాత్రి సమయాలలో ఇళ్ల ముందు కట్టేసిన గేదెలను, పగటి పూట పొలాలు వెళ్లిన గేదెలు, ఆవులను కొంతమంది దొంగలించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుట్లగూడానికి చెందిన సుమారు 15 గేదెలు గత రెండు నెలలకాలంలో మాయమయ్యాయి.
రెండు మూడు రోజులుగా గ్రామస్తులు దొంగలను పట్టుకోవాలన్న తపనతో కాపుకాసి రాత్రి గస్తీ తిరిగారు. మంగళవారం రాత్రి మినీలారీలో 4 గేదేలు తరలించడం చూసిన గ్రామస్తులు వారిని వెంబడించి చల్లగరిగ వద్ద అటకాయించారు. అవి అపహరించబడిన గేదెలుగా గుర్తించి అచ్చంపేట ఎస్ఐకి సమాచారం అందచేశారు. ఎస్ఐ తన సిబ్బంది సహాయంతో లారీని, గేదెలను, నిందితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు నెలల కాలంలో సుమారు 70కి పైగా గేదెలు అచ్చంపేట పరిసర గ్రామాల్లో చోరీకి గురయ్యాయి. అచ్చంపేట రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మరమెల ప్రసాదరావు, మార్టూరి నరసింహస్వామి, చిట్టేటి జాన్సీ అనే వారు తమ గేదెలు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పట్టాభిరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు