కారు కొందామంటూ ఒత్తిడి చేశాడని..
తమ్ముడిని కొట్టి చంపిన అన్న
దుండిగల్: కారు కొందామని తమ్ముడు.. వద్దని వారించిన అన్న.. ఇద్దరి మధ్య గొడవ.. క్షణికావేశానికి లోనైన అన్న సొంత తమ్ముడిని హత్య చేశాడు. పైగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు సంగతి బయట పెట్టాడు. ఈ సంఘటన సోమవారం దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన జానకీరామ్, చిలక అరుణ దంపతులకు వినయ్కుమార్ (23), కార్తీక్ కుమార్(19) సంతానం. అన్నదమ్ములిద్దరు అదే గ్రామంలో కారు మెకానిక్లుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా కారు కొందామని తమ్ముడు కార్తీక్ కుమార్ అన్న వినయ్కుమార్పై ఒత్తిడి తెస్తున్నాడు.
వీరిద్దరికి కొద్ది రోజులుగా డబ్బుల విషయంలో సైతం గొడవలు జరుగుతున్నాయి. కాగా మెకానిక్ షెడ్డుకు వచ్చిన ఓ కారును తీసుకుని అన్నదమ్ములిద్దరూ సోమవారం సాయంత్రం బిర్యానీ తినేందుకు గండిమైసమ్మలోని ఓ హోటల్కు వెళ్లారు. తిరిగి వెళ్తున్న క్రమంలో దుండిగల్ ఔటర్ రింగ్ సమీపంలో కారు విషయంలో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే కారు ఆపిన విజయ్కుమార్ డిక్కీలో ఉన్న రాడ్డుతో తమ్ముడు కార్తీక్ కుమార్ తలపై బలంగా మోదాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా అదే కారులో ఇంటికి వెళ్లి తమ్ముడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తల్లిదండ్రులకు చెప్పాడు. తిరిగి అదే కారులో తల్లిదండ్రులను ఎక్కించుకుని సంఘటనా స్థలానికి వచ్చి తమ్ముడిని కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి వెళ్తుండగా గండిమైసమ్మ చౌరస్తాకు రాగానే 108 అంబులెన్స్ తారస పడింది. దాంతో అందులో కార్తీక్ కుమార్ను సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కార్తీక్ మృతి చెందాడు. అయితే కార్తీక్ కుమార్ తలపై బలమైన గాయలు ఉండడం.. వినయ్కుమార్ పొంతన లేని మాటలు చెప్పడంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. వినయ్కుమార్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.