పెడదారితో కటకటాలు

Brother Arrested in Murder Case in Karnataka - Sakshi

సోదరుడి భార్యపై వ్యామోహం పెంచుకుని..

మరదలిపై కన్నేసి, తమ్ముని హత్య

బెంగళూరులో దురాగతం  

పట్టుబడిన అన్న, హంతక ముఠా  

సోదరుల స్వస్థలం హైదరాబాద్‌

కర్ణాటక, కృష్ణరాజపురం: వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి భార్యపై వ్యామోహం పెంచుకుని అతన్ని హత్య చేయించిన నిందితుడిని, సహకరించిన ముఠాను బుధవారం మహదేవపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సత్యప్రసాద్, లక్ష్మణ కుమార్‌లు వరుసకు అన్నా తమ్ముళ్లు అవుతారు. కొద్దికాలం క్రితం హైదరాబాద్‌కే చెందిన అక్కా చెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. తరువాత రెండు జంటలూ వృత్తిరీత్యా బెంగళూరుకు వచ్చారు.

సత్యప్రసాద్‌ లక్ష్మణ కుమార్‌ భార్య శ్రీజాపై కన్నేశాడు. తనతో ఉండాలని కోరగా, ఆమె అంగీకరించలేదు. దీంతో సత్యప్రసాద్‌ రాక్షసునిగా మారాడు. లక్ష్మణ కుమార్‌ను హత్య చేస్తే తప్ప శ్రీజా తనకు దక్కదని భావించి అందుకు పథకం రచించాడు. కిరాయి హంతకుడైన దినేశ్‌తో లక్ష్మణ కుమార్‌ను హత్య చేస్తే రూ.15లక్షల నగదుతో పాటు హైదరాబాద్‌లో ఇల్లు కూడా ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. దినేశ్‌ ఇదే విషయాన్ని తన భార్య సవితాకుచెప్పగా ఆమె కూడా హత్య పథకంలో పాలు పంచుకుంది. 

ఈ నెల 3న హత్య  
లక్ష్మణ కుమార్‌ బైకు, ఇల్లు, రోజూవారి దినచర్యలను గమనించిన నిందితుడు దినేశ్‌ పథకం అమలుకు సిద్ధమయ్యాడు. సహచరులైన ప్రశాంత్, ప్రేమ్, లోకేశ్, కుశాంత్, ఆంజనప్ప, రవిలతో కలసి ఒకసారి హొరమావు వద్ద హత్యకు యత్నించగా అది విఫలమైంది. రెండోసారి ఈ నెల 3వ తేదీన మహదేవపుర వంతెన వద్ద లక్ష్మణకుమార్‌ను చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపారు. అనంతరం బెంగళూరులోనే ఉంటున్న లక్ష్మణకుమార్‌ సొంత అన్న రాజశేఖర్‌కు ఫోన్‌ చేసి మీ తమ్ముడు హత్యకు గురయ్యాడని తెలిపి పారిపోయారు. రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మహదేవపుర పోలీసులు సూత్రధారుడు సత్యప్రసాద్‌తో పాటు నిందితుల ముఠాను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన మారణాయుధాలు, వాహనాలు స్వాధీనంచేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top