డాబాపై నుంచి పడి బాలుడి మృతి
గంగవరం (రంపచోడవరం): గంగవరం మండలం పిడత మామిడి గ్రామానికి చెందిన గంజేటి మోహన్ ఏడాదిన్నర కుమారుడు ఆదిత్య డాబాపై ఆడుకుంటూ కిందపడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం..ఆదిత్య ఇంటిపక్కన ఉన్న తాతయ్య సింగారయ్య డాబా మీద మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ మెట్లపై నుండి కింద పడడంతో తలకు బలమైన గాయమైంది.
దీంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. గంగవరం ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.