‘ పేలుడు’ కలకలం

Blast in Jubilee Hills Old Man Injured - Sakshi

జూబ్లీహిల్స్‌లో రసాయనాలు నీటితో కలవడంతో బ్లాస్ట్‌

వృద్ధుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రిలో చికిత్స

సాక్షి,సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ‘సాల్వెంట్‌ బ్లాస్ట్‌’ చోటు చేసుకుంది. పెయింటింగ్‌లో వినియోగించే రసాయనాలను మ్యాన్‌హోల్‌లోకి పారబోస్తుండగా జరిగిన రసాయన క్రియతో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో మాణిక్‌రావు(58) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మాణిక్‌రావు కృష్ణానగర్‌లో ఉన్న వెంకటగిరి ప్రాంతంలో రోడ్డు పక్కన ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు తదితరాలు సేకరించి అమ్ముకొని జీవిస్తుంటాడు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగే తాను సేకరించిన డబ్బాలు, సీసాలు, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించేందుకు వెంకటగిరిలోని బ్రాహ్మణవీధిలోలో స్క్రాప్‌ దుకాణానికి వచ్చాడు. సీసాలు అమ్మిన తర్వాత ప్లాస్టిక్‌ డబ్బాలు విక్రయిస్తున్నాడు. వీటిలో ఓ డబ్బాలో ఏదో ద్రవ పదార్థం ఉండటాన్ని షాపు యజమాని గమనించారు.

దాన్ని పారబోసి ఖాళీ చేసి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో ప్లాస్టిక్‌ డబ్బాలో ఉన్న ద్రవాన్ని సిమెంట్‌ మ్యాన్‌హోల్‌కు ఉన్న రంధ్రాల ద్వారా కింద పారుతున్న డ్రైనేజ్‌లో పోయడానికి ప్రయత్నించారు. కొద్దిమొత్తంలో లిక్విడ్‌ మ్యాన్‌హోల్‌లోకి పడిన వెంటనే పెద్ద శబ్ధంతో పేలుడు జరిగింది. ఆ ధాటికి మాణిక్‌రావు రెండు చేతులతో పాటు ముఖానికి, ఛాతికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పరిసరాలన్నీ రక్తంతో భీతావహంగా మారాయి. బాంబు పేలుడుగా భావించిన అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనేకమంది అటుఇటు పరుగులు తీశారు. తీవ్ర రక్తస్రావంతో మాణిక్‌రావు అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు ‘108’కు సమాచారం అందించారు. వారు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మాణిక్‌రావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. 

ఎక్సోథర్మిక్‌ రియాక్షన్‌ కారణంగానే...
పేలుడు జరిగిన ప్రాంతాన్ని సిటీ క్లూస్‌ టీమ్స్‌ సందర్శించాయి. ఆద్యంతం పరిశీలన చేసిన నేపథ్యంలో ‘ఎక్సోథర్మిక్‌ రియాక్షన్‌’ కారణంగానే ఈ పేలుడు జరిగినట్లు తేల్చాయి. పెయింట్స్‌లో వినియోగించే కొన్ని రకాలైన థిన్నర్స్, ఉడ్‌ పాలిష్‌ రసాయనాలు సున్నిత స్వభావంతో ఉంటాయి. వీటికి నిప్పు మాత్రమే కాదు నీరు తగిలినా పేలడంతో పాటు మంటలు వ్యాపింపజేస్తాయి. ఇలాంటి ఓ సాల్వెంట్‌తో కూడిన రసాయనమే మాణిక్‌రావు తీసుకువచ్చిన డబ్బాలో ఉంది. దీన్ని మ్యాన్‌హోల్‌ ద్వారా డ్రైనేజీలో పోయడానికి అతడు ఉపక్రమించాడు. దాని రంధ్రాల నుంచి కిందికి వెళ్లిన సాల్వెంట్‌ నీళ్లు తాకగానే ‘ఎక్సోథర్మిక్‌ రియాక్షన్‌’కు గురైంది. ఈ కారణంగానే మంటతో పాటు శబ్ధంతో కూడిన పేలుడు జరిగింది. ఇది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ దాని ప్రభావమే వృద్ధుడు తీవ్రంగా గాయపడటానికి కారణమైందని క్లూస్‌ నిపుణులు తేల్చారు. ఏ సాల్వెంట్‌ ఇందుకు కారణమైందనేది తేలాలంటే ప్లాస్టిక్‌ డబ్బా దొరకాల్సి ఉంది. దీనికోసమే పోలీసులు, క్లూస్‌ అధికారులు గాలిస్తున్నారు. అది లేదా శకలాలు దొరికిన తర్వాత ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తే సాల్వెంట్‌ను గుర్తించే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top