కొడుకుకు ఉరేసిన తండ్రి.. వీడియో తీసిన బిడ్డ
బెంగళూరు : చీటీ వ్యవహారాల్లో తీవ్ర నష్టాలు రావడంతో మనస్థాపం చెందిన ఓ కుటుంబం మూకుమ్మడి బలవన్మరణానికి సిద్దమైంది. తొలుత అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకును తండ్రి బలవంతంగా చంపేశాడు. తల్లి వద్దంటున్నా... కూతురు కాదంటున్న వినకుండా భయానకంగా ఉరితీశాడు. ఈ దారుణ ఘటన బెంగుళూరులోని విబూతినగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.... విభూతిపుర ఎస్ఎల్ఎన్ స్కూల్ వద్ద సురేశ్బాబు, గీతాభాయి (45) దంపతులు నివాసముంటున్నారు. వీరికి 17 ఏళ్ల కూతురితో పాటు వరుణ్ (12) అనే కుమారుడు ఉన్నాడు. సురేశ్బాబు ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తుండగా గీతాబాయి ఇంటి వద్ద కిరాణాదుకాణం నిర్వహించడంతో పాటు చీటీల నడిపేది. ఇటీవల చీటీల లావాదేవీలలో నష్టాలు రావడంతో చీటీలు వేసిన వ్యక్తులు డబ్బుకోసం గీతాబాయిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు.
దీంతో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న సురేశ్ బాబు తొలుత 12 ఏళ్ల కుమారుడికి ఊరేసి చంపాడు. అయితే కొడుకును చంపుతుండగా కూతురు తన మొబైల్ వీడియో తీసింది. కొడుకు మరణం అనంతరం తన భార్య కూడా ఆత్మహత్య చేసుకుందని, తాను కూడా బలవన్మరణానికి సిద్దంగా కాగా తన కూతురు ఆపిందని సురేశ్ పోలీసులకు తెలిపాడు. తొలుత తన భార్యే కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసిన సురేశ్.. కూతురు పక్కింటివారికి ఈ దారుణ విషయం తెలపడంతో అసలు వ్యవహారం వెలుగుచూసింది. పోలీసులు సురేశ్ను అరెస్ట్ చేసి.. హత్యతో పాటు.. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ దారుణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అతని కూతురు నుంచి ఆరా తీస్తున్నారు.