‘మాలేగావ్‌’ నిందితులకు బెయిల్‌

Bail  Grant To The Accused of Malegaon Bomb Explosion - Sakshi

ముంబై: మాలేగావ్‌ వరుస పేలుళ్లలో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్‌ ఐఏ మహంతి, జస్టిస్‌ ఏఎమ్‌ బాదర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ధాన్‌ సింగ్‌, లోకేశ్‌ శర్మ, మనోహర్‌ నర్వారియా, రాజేంద్ర చౌదరిలకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ. 50 వేలు పూచీకత్తు సమర్పించాలని, విచారణ సమయంలో ప్రతిరోజు స్పెషల్‌ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాక సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించరాదనే షరతును విధించింది. 2016లో ప్రత్యేక న్యాయస్థానం వీరికి బెయిల్‌ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. 2013లో అరెస్టు అయినప్పటి నుంచి ఈ నలుగురు  జైళ్లో ఉన్న సంగతి విదితమే.

2006, సెప్టెంబరు 8న నాసిక్ సమీపంలోని మాలేగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును మొదట మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక సంస్థ విచారణకు తీసుకొని మైనార్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసింది. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అనంతరం ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేతుల్లోకి వెళ్లింది. మెజారిటీ వర్గానికి చెందినవారే ఈ పేలుళ్లకు పాల్పర్డారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఎన్‌ఐఏ.. మొదట నిందితులుగా ఉన్న తొమ్మిది మందిపై ఉన్న చార్జ్‌షీట్‌ను తొలగించింది. దీంతో 2016లో స్పెషల్ ట్రయల్ కోర్టు ఎన్ఐఏ వాదనలను అంగీకరించి, తొమ్మిది మంది నిందితులను విడుదల చేసింది.   

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top