అత్తా, కోడలు దారుణ హత్య
రాజేంద్రనగర్: అత్తా కోడలు దారుణ హత్యకు గురైన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మొసిన్ అహ్మద్ అనే వ్యక్తి భార్య తయ్యాబాబేగం(25), తల్లి సబీనాబేగం(55)తో కలిసి రోషన్ కాలనీలో ఉంటూ ట్రూప్ బజార్లోని ఓ సానిటరీ దుకాణంలో మేనేజర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను దుకాణానికి వెళ్లిపోగా ఇంట్లో భార్య, తల్లి మాత్రమే ఉన్నారు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అతను భార్యకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన అతను లోపలి నుంచి గేటు వేసి ఉండడంతో తల్లి, భార్యను పిలిచినా పలుకకపోవడంతో పక్కనే ఉన్న మరో గేటు ద్వారా లోపలికి వెళ్లి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా హాల్లో రక్తపు మడుగులో తల్లి మృతి చెంది ఉండగా బెడ్ రూంలో అతని భార్య దారుణ హత్యకు గురై ఉండటాన్ని గుర్తించాడు.
స్థానికులతో కలిసి మైలార్దేవ్పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. నలుగురి వేలి ముంద్రలను గుర్తించినట్లు సమాచారం. డాగ్ స్క్వాడ్ ఇంట్లోని బెడ్రూమ్తో పాటు హాల్, వరండా, సిట్టింగ్ రూమ్లో తిరిగి రోడ్డు వరకు వచ్చి తిరిగి ఇంటికి చేరాయి. ఇంట్లోని అల్మారా ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదని మోసిన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తలపై బలమైన ఆయుధంతో దాడి చేయడంతో వారు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో పెనుగులాడిన ఆధారాలు లభించకపోవడంతో తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నాడరు. తయ్యాబాబేగం సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.