ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టేందుకు స్కెచ్
సాక్షి, ముంబై : తనను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి తన భార్య ఆయింట్మెంట్లో విషం కలిపి ఆ లేపనాన్ని తనకు అందించిందని భర్త ఆరోపించారు. ఆర్మీ జవాన్గా పనిచేసే ఓ వ్యక్తి ఇటీవల సెలవుపై స్వస్ధలానికి రాగా, లైంగిక ఉద్దీపన కోసం లేపనాన్ని వాడాలని భర్తకు అందించింది. అయితే ఆ ఆయింట్మెంట్ను భర్త తన ప్రైవేట్ భాగాల్లో రాసుకోగానే భరించలేని నొప్పి కలిగింది. దీంతో స్ధానిక వైద్యుడిని జవాన్ సంప్రదించగా ఆయింట్మెంట్లో విషపదార్ధాలు కలిపారని, అదృష్టవశాత్తూ ప్రాణాలకు ముప్పు కలగలేదని వైద్యుడు తెలిపారు.
భార్యపై అనుమానం వచ్చిన జవాన్ దీనిపై అహ్మద్నగర్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ ఫిర్యాదుపై తాము ఆదివారం కేసు నమోదు చేశామని, తాము ఇంకా నిందితులు ఉపయోగించినట్టు చెబుతున్న పదార్ధాన్ని సీజ్ చేయలేదని, దీన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిన తర్వాతే మిగిలిన వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. జవాన్ భార్య పుట్టింటికి వెళ్లడం, ఆమె ప్రియుడుగా చెబుతున్న వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో నిందితులను ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఎస్ఐ రాజేంద్ర పవార్ తెలిపారు.