నటిపై దాడి చేసిన రూమ్మేట్.. కేసు నమోదు
సాక్షి, న్యూ ఢిల్లీ : పలు టీవీ సీరియల్స్తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నళినీ నేగి తనపై దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించారు. తన రూమ్మేట్ ప్రీతీ రానా, ఆమె తల్లితో కలిసి తనమీద భౌతికదాడికి దిగినట్టుగా కంప్లయింట్లో పేర్కొన్నారు. కొంతకాలం తన ఇంట్లో ఉండేందుకు రిక్వెస్ట్ చేసిన ప్రీతి రానా, ఆమె తల్లి స్నేహలత రానాలను ఖాళీ చేయాల్సిందిగా కోరటంతో వారు దాడికి దిగినట్టుగా నళిని వెల్లడించారు.
గతంలో నళిని, ప్రీతిలు కొంతకాలం ఒకే రూమ్లో కలిసి ఉన్నారు. తరువాత నళిని సొంతంగా ఓ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు. ప్రీతి కూడా మరో చోటికి మారాలని భావించినా సరైన ఫ్లాట్ దొరకకపోవటంతో నళినిని సాయం చేయమని కోరారు. గతంలో కలిసి ఉన్నా వారు కావటంతో నళిని కూడా ప్రీతి తన ఫ్లాట్లో కొద్ది రోజులు ఉండేందుకు అంగీకరించారు. కానీ తరువాత ప్రీతి తల్లి, స్నేహలత కూడా ఫ్లాట్కు రావటంతో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు.
ఫ్లాట్ ఖాళీ చేయాల్సిందిగా కోరినా పట్టించుకోకపోవటంతో పాటు తన వ్యక్తిగత విషయాల్లో కలగచేసుకోవటంతో నళినీ, స్నేహలతల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇటీవల ఈ వివాదం మరింత ముదరటంతో ప్రీతి, స్నేహలతలు నళినీ మీద భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన నళిని ఒషివారా పోలీస్ స్టేషన్లో తల్లీకూతుళ్లపై కంప్లయింట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.