చిన్నారి తల పగలకొట్టిన తల్లి ప్రియుడు!
తిరువనంతపురం : పక్కలో మూత్రం పోసుకున్నాడని నాలుగేళ్ల కుర్రాడిని తల్లి ప్రియుడు చితకబాదుతుండగా.. తమ్ముడిని రక్షించడానికి అడ్డు వెళ్లిన ఏడేళ్ల అన్న తల పగిలి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన గత 8 రోజులు కింద కేరళలోని ఎర్రాకుళం జిల్లాలో చోటుచేసుకోగా.. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆ చిన్నారి శనివారం తుదిశ్వాస విడిచాడు. ఎర్రాకుళంలోని కులెచెరీ ఏరియాలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల మహిళకు ఇద్దరు కొడుకులున్నారు. ఓ కొడుకు వయసు ఏడేళ్లు కాగా చిన్నోడి వయసు నాలుగేళ్లు. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా అతనితో వేరుపడి, 36 ఏళ్ల అరుణ్ ఆనంద్తో సహజీవనం చేస్తోంది.
గత గురువారం అర్థరాత్రి పక్కతడిపాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరుణ్ ఆనంద్ నాలుగేళ్ల చిన్నారిని కొట్టబోతుంటే అతని అన్న అడ్డువెళ్లాడు. దీంతో అతన్ని లాగిపడేసిన ఆనంద్..తలను గోడకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా కట్టెతో తలపై దాడి చేశాడు. దీంతో ఆకుర్రాడి పుర్రెలో తీవ్ర గాయమై రక్తస్రావమైంది. ఉపిరితిత్తుల్లో కూడా గాయాలయ్యాయి. వారిని అలాగే వదిలేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఇది గమనించిన ఆ కుర్రాడి తల్లి వెంటనే ఆసుపత్రికి తరలించింది. తలకు దెబ్బ బలంగా తగలడంతో పుర్రెకు పగులు వచ్చిందని, గుండెల మీద కూడా తీవ్రంగా కొట్టడంతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. 8 రోజులుగా ఆ కుర్రాడిని రక్షించాడానికి కృషి చేశారు. కానీ చివరకు ఆ కుర్రాడు తుదిశ్వాస విడిచాడు. బాలుడి తమ్ముడి నుంచి ఏం జరిగిందో తెలుసుకున్న పోలీసులు...అరుణ్ ఆనంద్ను అదుపులోకి తీసుకున్నారు.