రామంతాపుర్లో దారుణం.. చిన్నారిని ఢీకొట్టిన ఆటో
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్, రామంతాపుర్లో దారుణం చోటుచేసుకుంది. అతివేగం అభం శుభం తెలియని ఓ చిన్నారిని బలితీసుకుంది. తల్లి, తండ్రితో కలిసి సరదాగా నడుచుకుంటున్న వెళ్తున్న ఆ చిన్నారిని వేగంగా దూసుకొచ్చిన ఆటో పొట్టన బెట్టుకుంది. స్థానికంగా నివసించే ఉమేశ్ తన భార్య, పిల్లలతో కలిసి కిరాణ షాప్కు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఆటో వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఉమేశ్ కుమారుడు మోహిత్ (5)ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు.
ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. అప్పటి వరకు తమతోనే ఉన్న కుమారుడు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. వారి ఆర్తనాదాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా అయ్యోపాపం అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.