భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..
పూణే : తనకు అద్భుత శక్తులు ఉన్నాయని, భర్తకు ఉన్న వ్యాధుల్ని నయం చేస్తానని నమ్మించి ఓ దొంగ బాబా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెను పలుమార్లు లొంగదీసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూణే ఖరాడీకి చెందిన ఓ మహిళ భర్త గత కొన్ని సంవత్సరాలుగా షుగర్, డయాబెటీస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. అంకిత్ సంజయ్ అనే దొంగ బాబా.. మహిళ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్నాడు. తన దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయని అన్ని రోగాలను నయం చేస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఓ రోజు ఇంటికి రావాల్సిందిగా అతడిని కోరింది. ఆమె కోరిక ప్రకారం ఇంటికి వెళ్లిన అతడు మత్తు మందు కలిపిన పాలను భార్యాభర్తలకు ఇచ్చాడు.
అవి తాగి వారు స్పృహ కోల్పోగానే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆమె మెలుకువలోకి రాగానే వీడియోను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి హింసను తాళలేకపోయిన మహిళ ధైర్య చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడిపై మరికొన్ని ఆరోపణలు రావటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.