విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..
రాయ్పూర్ : భార్యను వదిలించుకోవడానికి కుటిల పన్నాగం పన్నాడు ఓ భర్త. సొంత భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించి వదిలించుకునే ప్రయత్నం చేసాడు. ఈ దారుణ ఘటన చత్తీస్ఘడ్లోని కబిర్దామ్ జిల్లాలోని పైపర్ తోలా గ్రామంలో చోటుచేసుకుంది. మైనర్ అయిన బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పైపర్తోలా గ్రామానికి చెందిన ఖిలేంద్ర సాహూ(19)తో బాధితురాలికి 40 రోజుల క్రితం వివాహమైంది. అయితే ఖిలేంద్ర ఓ రోజు ఆధార్కార్డ్ కోసమని తన భార్యను సమీప పట్టణమైన కవార్థాకు తీసుకెళ్లాడు. ఆమెతో రెండు రూ.50 విలువ గల స్టాంప్పేపర్స్పై సంతకం తీసుకున్నాడు.
అనంతరం ఓ హోటల్ తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అతని స్నేహితుడు కమలేష్ ఉన్నాడు. ఒక బాండుపై తన భార్య తనతో విడాకులు తీసుకుందని, మరో బాండుపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని పేర్కొన్నాడు. మళ్లీ వస్తానని చెప్పి ఖిలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోగానే కమలేష్ బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనానంతరం ఖిలేంద్ర తన భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత కమలేష్ బాండ్ పేపర్స్ పట్టుకొని బాధితురాలు తన భార్య అంటూ గొడవ చేయడంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది.
పెద్దమనుషుల ఖిలేంద్రను పిలిచి పంచాయితీ పెట్టగా.. తన భార్య మంచిది కాదని, తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, స్వయంగా తానే చూశానని నిందలు వేశాడు. ఎట్టి పరిస్థితులో తాను ఆమెతో కాపురం చేయనని చెప్పాడు. అయితే బాండ్ల వ్యవహారంపై అనుమానం రావడంతో కమలేష్ను గట్టిగా అడగ్గా.. అసలు విషయం బయటపడింది. భార్యను వదిలించుకోవడానికి ఖిలేంద్రనే తన సహాయం కోరాడని కమలేష్ చెప్పడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసునమోదు చేసుకొని నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.