చిన్నారి అదృశ్యం, హత్య
సాక్షి, చెన్నై: చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. అప్పటివరకు తోటి స్నేహితులతో కలిసి ఆడిపాడిన పదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు.. చెన్నై కాశీమేడుకు చెందిన మత్స్యకారుడు ప్రకాష్ (40), మాలిని (35) దంపతుల కుమార్తె జెసికా (10) ఐదో తరగతి చదువుతోంది. కాగా శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సముద్ర తీరంలో ఆడుకునేందుకు జెసికా బయటికి వెళ్లింది. ఈ క్రమంలో సమీపంలోని అమ్మవారి ఆలయంలో వేడుకలు చూసేందుకు జెసికా తల్లిదండ్రులు బయల్దేరుతూ.. ఆమె కోసం చూడగా కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. జెసికా కోసం వెదికుతున్న క్రమంలో.. కాశీమేడు సముద్రపు నీటి ఒడ్డున ఆమె స్పహతప్పి పడి ఉన్నట్లు కనుగొన్నారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే జెసీకా ప్రాణాలు విడిచింది. కాశీమేడు పరిసరాల్లో మాదకద్రవ్యాలు తీసుకునే యువకులే చిన్నారిపై అత్యాచారం చేసి సముద్రంలోకి విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.