నా భార్య పండక్కి ఊరెళదామని పట్టుబట్టింది
ఇప్పుడు పల్లెలకు వెళ్లటం ఫ్యాషన్గా మారింది: సీఎం
సాక్షి, తిరుపతి: ‘పదిహేనేళ్ల కిందట నా భార్య ప్రతి సంక్రాంతికి ఊరెళదామని పట్టుబట్టింది. అందుకు ఆమెకు కృతజ్ఞతలు. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాలన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు పల్లెలకు వెళ్లటం ఫ్యాషన్గా మారింది. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఉండే అలవాటు చేసుకోవాలి’అని సీఎం చంద్రబాబు సూచించారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి నారావారిపల్లె వచ్చిన ఆయన మంగళవారమిక్కడ పుదిపట్ల నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే స్వగ్రామంలో 30 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిమెంట్ రోడ్ల వల్ల మోకాళ్ల నొప్పులొచ్చే ప్రమాదం ఉందని.. అందుకే మట్టిరోడ్లు కూడా అవసరమన్నారు.
మీరు పండుగ చేసుకుంటే సరిపోతుందా..?
సీఎంపై సామాన్యుడు ఫైర్
చంద్రగిరి: ‘మీరు పండుగ చేసుకుంటే సరిపోతుందా.. మరి మా సంగతేంటి?’అంటూ సీఎం చంద్రబాబుపై ఓ సామాన్యుడు ఫైర్ అయ్యాడు. మంగళవారం ఉదయం 9.45 నుంచి సుమారు 3 గంటల పాటు రంగంపేట నుంచి నారావారిపల్లి మీదుగా కొత్తపేటకు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, పులిచెర్ల మండలం కొత్తపేటకు చెందిన ఓ ప్రయాణికుడు నేరుగా సీఎం బస వద్దకు వెళ్లి ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సీఎం పక్కనే ఉన్న అర్బన్ ఎస్పీ అభిషేక్తో మాట్లాడి వెంటనే రంగంపేటలోని ట్రాఫిక్ను క్లియర్ చేయాలని ఆదేశించారు. తన వల్ల ఇబ్బంది కలిగితే సారీ అంటూ సీఎం క్షమాపణ చెప్పారు.